ఏపీలో సమ్మె సైరన్ మోగుతుంది. ఇప్పటికే అంగన్ వాడీలు సమ్మెలో ఉన్నారు. తాజాగా మున్సిపల్ కార్మికులు కూడా ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. అటు వాలంటీర్లు కూడా విధులు బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని కోరారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో అంగన్ వాడీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. విధులు బహిష్కరించి అంగన్ వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. ప్రభుత్వం ఓవైపు చర్చలు జరుపుతున్నా కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల వేళ రాష్ట్రంలో కార్మిక సంఘాల వరుస నిరసనలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆర్ధిక వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వం కూడా కార్మికులకు నచ్చజెప్పే పరిస్ధితులు కూడా కనిపించడం లేదు. ఎన్నికల నేపథ్యంలో మంత్రులు కూడా బిజీగా ఉంటున్నారు. దీంతో మున్సిపల్ కార్మికులతో ఇప్పట్లో చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
సమ్మెపై నారా లోకేష్ స్పందించారు. మున్సిపల్ కార్మికులకు టీడీపీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇచ్చారు.