Anganwadi strike : అనంతపురం జిల్లా గుంతకల్ లో అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. గత 4 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడి టీచర్ల నిరవధిక సమ్మె చేస్తున్నారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు నల్ల చీరలు ధరించి భిక్షటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు అంగన్వాడి కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ తాళాలను పగలగొట్టించారు. ఆ సెంటర్లను స్వాధీనం పరుచుకున్నారు. అనంతరం అంగన్వాడీ సెంటర్ లో ఉన్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలకు అందజేశారు.
మరోపక్క అంగన్వాడీ టీచర్లు 4 రోజులుగా సమ్మె చేస్తున్నారు. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. తాము శాంతియుతంగా నిరవధిక సమ్మె చేపడుతుంటే ప్రభుత్వం తమ సమస్యలను పిడచెవిన పెడుతోందన్నారు. అంగన్వాడీ సెంటర్లను సచివాలయ సిబ్బందితో రీఓపెన్ చేయించడం చాలా దారుణం అని అంగన్వాడి టీచర్లు అన్నారు. అనంతరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.
మరోపక్క ప్రభుత్వ అధికారులు తాళాలు పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను తెరవడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాలు ఎలా తెరుస్తారంటూ ఐద్వా అధ్యక్షురాలు చేబ్రోలు బసవపూర్ణ విద్యాశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన, ప్రజా సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోవటం లేదని అన్నారు. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో అంగన్వాడి కేంద్రాల్లో విధులు చేయించడం వివాదాస్పదం అవుతుంది అని ఐద్వా అధ్యక్షురాలు మండిపడ్డారు.