ఆంధ్ర ప్రదేశ్ లో అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం ఉద్ధృతంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అంగన్వాడీలు పోరాటం చేస్తున్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంగన్వాడీల పై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు.
మంత్రి జోగి రమేష్ బయటకు రావాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంటి ముట్టడి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అంతకు ముందు రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీ రోడ్డులోని మంత్రి ఇంటికి ర్యాలీగా చేరుకున్నారు. సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సిహెచ్.శ్రీనివాస్, సీఐటీయూ ఇబ్రహీంపట్నం, మైలవరం మండలాల కార్యదర్శులు ఎం.మహేష్, సిహెచ్.సుధాకర్ తదితరులు నాయకత్వం వహించారు.