Chandrababu on Lakshmi Parvathi(AP political news): వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన లక్ష్మీ పార్వతి నాడు దివంగత నేత సీనియర్ ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకుని యావత్ ఏపీ రాష్ట్రంలోనే సంచలనంగా మారారు. ఆ తర్వాత పరోక్ష రాజకీయాల ద్వారా టీడీపీలో నెంబర్ టూ గా మారారు. ఎన్టీఆర్ మరణంతో ఒంటరి అయిన లక్ష్మీ పార్వతి చంద్రబాబును విభేదిస్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతతోనే లక్ష్మీ పార్వతి వైఎస్ జగన్ పార్టీలో చేరారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంటారు. చంద్రబాబు అవినీతి పాలనను ఎండగట్టి అప్పట్లో వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి నిరంతర కృషి చేశారు. అక్రమాస్తుల కేసులో చంద్రబాబు అరెస్టయినప్పుడు కూడా బాబుకు ఈ శాస్తి జరగాల్సిందేనని బహిర్గతమయ్యారు.
బాబుకు వ్యతిరేకంగా..
చంద్రబాబు అవినీతిపరుడని, తన భర్త ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడని.. ఎప్పటికైనా అందుకు తగిన శిక్ష అనుభవిస్తాడని అంటూ చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వచ్చారు. జగన్ మాత్రం లక్ష్మీ పార్వతిని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అందుకే తన హయాంలో ఆమెకు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ హోదాను కల్పించారు. అదే క్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ ఆమెకు గౌరవ ఆచార్యురాలి హోదాని కట్టబెట్టింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది. సహజంగానే అధికారంలో ఉన్న పార్టీ గత ప్రభుత్వ హయాంలో గౌరవ పదవులు పొందే వ్యక్తులను మారుస్తుంటుంది. అంతేకాదు ఆ ప్రభుత్వ తాలూకు ఏ పథకాన్నీ ప్రోత్సహించదు. కీలక బాధ్యతలు తీసుకునే అధికారులను సైతం మార్చేస్తుంటుంది. ఇప్పుడు ఇదే క్రమంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆమెకు ఇచ్చిన గౌరవ ఆచార్యురాలు హోదాని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది.
ఎలాంటి గౌరవ భృతి ఇవ్వలేదు
ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వలన లక్ష్మీ పార్వతి నుంచి ఈ గౌరవ హోదాని వెనక్కి తీసుకుంటున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా ఆమె ఈ హోదాలో యూనివర్సిటీ నుంచి ఎలాంటి గౌరవ భృతి అందుకోలేదని అన్నారు. ఇప్పుడు ఈమె స్థానంలో మరో రీసెర్చ్ స్కాలర్ ను నియమించబోతున్నామని తెలిపారు. అయితే ఇందుకు స్పందనగా లక్మీపార్వతి మాట్లాడుతూ.. ఇదంతా పొలిటికల్ డ్రామాలో భాగమేనని అన్నారు. చంద్రబాబుకు తనపై ఉన్న వ్యక్తిగత కక్షను ఇలా తీర్చుకుంటున్నారని అన్నారు. తన భర్త ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభించబడిందని ప్రస్తుతం అది విలువలు కోల్పోయిన వారి చేతిలో ఉందని అన్నారు. తనకు మొదటినుంచి ఎలాంటి పదవులపై ఆశ లేదన్నారు.