AP DA latest news(AP news today telugu): ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండు డీఏలను మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ 3.64 శాతం, అలాగే గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డీఏ 3.64 శాతం మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతేడాది జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారికి రావాల్సిన వేతనాలతో కలిపి అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డీఏ బకాయిల్లో కొంత మొత్తం జనరల్ ప్రావిడెంట్ ఫండ్(GPF)కు జమ చేయనుంది.
ప్రభుత్వం ప్రకటించిన డీఏతో ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుంది..?
డీఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ ఛార్జ్ ఉద్యోగులకు, యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్ సిబ్బంది, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: YSRCP Final List : నేడే వైసీపీ తుది జాబితా.. నెట్టింట చక్కర్లు కొడుతున్న లిస్ట్ ఇదే..
సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు
గతంలో సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంచారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరఫున చైర్మన్ కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని పలు ఉద్యోగ సంఘాలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపాయి.