Dana Cyclone :
⦿ రేపు తీవ్ర తుఫానుగా మారనున్న దానా
⦿ సముద్ర తీర ప్రాంతంలో గంటకు 90 నుంచి 120km వేగంతో గాలులు
⦿ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం
⦿ లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలిస్తున్న అధికారులు
⦿ నేడు, రేపు కూడా తుఫాను ప్రభావం
⦿ ఉత్తరాంధ్ర జిల్లాలతో సహా పశ్చిమ బెంగాల్, ఒడిశాకు ఎఫెక్ట్
⦿ ఉత్తరాంధ్రకు వెళ్లే రైళ్లన్నీ రద్దు
⦿ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్న అధికారులు
⦿ తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
⦿ విజయవాడలో రైల్వే హెల్ప్ లైన్ ఏర్పాటు
అమరావతి, స్వేచ్ఛ:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు దానా తుఫానుగా రూపాంతరం చెందనుంది. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, పశ్చిమ బెంగల్ తీర ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరన శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలులు దృష్ట్యా ఏపీకి సంబంధించిన అన్ని పోర్టులలో ముందస్తు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా జిల్లాలకు చుట్టుపక్కల గ్రామాలతో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పటికే కోస్తా తీరం వెంట ఉండే పలు జిల్లాలకు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్ , ఒడిశా రాష్ట్రాలకు వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
పలు రైళ్లు రద్దు
ఇప్పటికే విజయవాడ డివిజన్ నుంచి వైజాగ్ డివిజన్ వెళ్లే ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు చేశారు అధికారులు. నేడు, రేపు కూడా భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం దాకా రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ లో హెల్ప్ లైన్ డెస్క్ లు ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఏ రైలు ఎప్పుడు వస్తుంది? ఎంత ఆలస్యంగా నడుస్తుందో హెల్ప్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. గంటకు 18 కి.మీ. వేగంతో వాయుగుండం ప్రయాణిస్తోంది. పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనుంది.
ALSO READ : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు
తీర ప్రాంతాలు అల్లకల్లోలం
తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారుతాయని.. గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంత అధికారులు సూచిస్తున్నారు. అన్ని జిల్లా ముఖ్య కేంద్రాలలో తుపాను పునరావాస కేంద్రాలలో హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత జిల్లా కలెక్టర్లు, పలువురు రెవెన్యూ అధికారులు తమ సెలవులు రద్దు చేసుకుని నిరంతరం ప్రజలకు అండగా ఉండాలని సీఎం సూచించారు. అటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అప్రమత్తం అయ్యాయి. తీర ప్రాంతాలలో ముందస్తు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అధిక వర్షాలు పడతాయన్న హెచ్చరికలో లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను ముందుగానే సహాయక కేంద్రాలకు తరలిస్తున్నారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు
తుఫాను ప్రభావం నేడు రేపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, విశాఖ పట్నం పరిధిలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు కురవవచ్చని..అధికారులంతా అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు.