Congress Chief YS Sharmila on Jagan(AP politics): సుదీర్ఘ పాదయాత్రతో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టి వైఎస్ తన పాలనతో కాంగ్రెస్ ఇమేజ్ పెంచారు. కాంగ్రెస్లో సీల్డ్ కవర్ సీఎంల కల్చర్కి చెక్ పెట్టిన వైఎస్ తనదైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అనుకున్నది చేసి చూపించే తెగువతో డేరింగ్ సీఎం అనిపించుకున్న ఆయన పొలిటికల్ వారసుడు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చల్లో జరుగుతుంది. అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జగన్ సంశయిస్తున్నారు. జగన్ వైఖరిని తప్పుపడుతున్న షర్మిలపై వైసీపీ నేతలు తలతోకాలేని విమర్శలు చేస్తున్నారు. దాంతో వైఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిమానులు వాపోతున్నారిప్పుడు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకుంటూ ప్రత్యేక పేజీలు సంపాదించుకున్నారు. తనకంటూ పొలిటికల్ గా బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నాయకుడు. కాంగ్రెస్ హైకమాండ్ సీల్డ్ కవర్ సీఎంల సంస్కృతికి చెక్ పెట్టి రాష్ట్రా కాంగ్రెస్ను శాసిస్తూ పరిపాలించారాయన. ఒక్క ముక్కలో చెప్పాలంటే డేరింగ్ అండ్ డేషింగ్ సీఎం అనిపించుకున్నారు. అందుకే ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో అభిమానులు కనిపిస్తారు.
అలాంటి కాంగ్రెస్ లీడర్ వారసుడు జగన్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది. వైఎస్సార్ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించారు. తండ్రి తరహాలో సుదీర్ఘ పాదయాత్ర చేసి జనంలోనే తిరిగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ ప్రజలకు చేరువగానే ఉంటూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019లో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యారు.
రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ ఎప్పుడూ ప్రజాజీవితానికి దూరం కాలేదు. అయితే సీఎం అయిన తరువాత జగన్ కొత్త రూటు పట్టారు .. ప్రజల్లోకి రావడమే మానేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో తాను నివాసం ఉంటున్న తాడేపల్లిలోనే స్వేచ్చగా రోడ్లపై తిరగలేకపోయారు. పరదాల మాటునే ఆయన పర్యటనలు, సభలు జరిగాయి. దానిపై టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఆయనకు జనంలోకి రావడం అంటే భయం అని అప్పట్లోనే యద్దేవా చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆ విమర్శలు కొనసాగుతూ జగన్ ట్రోల్ అవుతున్నారు.
Also Read: ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపేస్తున్నారా?
ఇపుడు జగన్ విపక్షంలోకి వచ్చారు. వైనాట్ వన్ సెవెన్టీ ఫైవ్ అన్న ఆయనకి 11 సీట్లే దక్కాయి. ఆ ఎఫెక్ట్తె ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి వెళ్ళడంలేదు. దాంతో టీడీపీ కూటమి పెద్దలు జగన్ని భయంతోనే అసెంబ్లీకి రావడం లేదు అని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక జగన్ సొంత చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ అయిన షర్మిల అయితే జగన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అంత పిరికివాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? ప్రజల్ని పట్టించుకోని జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టరా అది పిరికితనం తప్ప మరోటి కాదని ఆమె తేల్చేశారు. అసెంబ్లీకి హాజరుకాకుండా ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నట్లు వ్యవహరిస్తూ పిరికివాడని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి బదులిస్తూ వైసీపీ నేతలతో జగన్ సొంత చెల్లెలిపైనే కౌంటర్లు వేయిస్తున్నారు. తెలంగాణాలో పార్టీ పెట్టి అక్కడ నడపలేక ఏపీకి వచ్చిన షర్మిల కంటే పిరికి రాజకీయ నాయకురాలు ఎవరు ఉంటారు అని ఎద్దేవా చేస్తున్నారు. 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్షహోదా కూడా కోల్పోయిన వైసీపీ సాటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఏదేమైనా దివంగత వైఎస్ అభిమానులకు ఆయన వారుసుడిగా చెప్పుకుంటున్న మాజీ సీఎం వైఖరి మింగుడుపడటం లేదంట. డేరింగ్ లీడర్గా గుర్తింపు ఉన్న వైఎఎస్ బిడ్డలు నువ్వు పిరికి అంటే నువ్వు పిరికి అని విమర్శించుకుంటుండటం. ఆయన ఇమేజ్కే డ్యామేజ్గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. షర్మిల ఏపీకి షిఫ్ట్ కావాలనుకోవడం తెలంగాణలో పరిస్థితుల కారణంగా తీసుకున్న రాజకీయ నిర్ణయం. మరి జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవడం వెనుక లెక్కలేంటో ఆయనకే తెలియాలి. మొత్తానికి జగన్ సొంత చెల్లెల్నే తన పార్టీ వారితో టార్గెట్ చేయిస్తుండటం దివంగత నేత అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నట్లు కనిపిస్తుంది