AMBEDKAR STATUE : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు మరింత గౌరవాన్ని ఇనుమడింపచేయనుంది ఏపీ ప్రభుత్వం. భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తిచేసుకున్నాయి. ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే సమయం ఆసన్నమైంది.
AMBEDKAR STATUE Inauguration(Latest news in Andhra Pradesh) :
భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిధి అయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు మరింత గౌరవాన్ని ఇనుమడింపచేయనుంది ఏపీ ప్రభుత్వం. భావి తరాలకు గుర్తుండేలా విజయవాడలో భారీ ఎత్తున ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తిచేసుకున్నాయి. ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే సమయం ఆసన్నమైంది.
అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది. 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. 81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం మొత్తం కలిపి 206 అడుగుల భారీ ఎత్తున నిర్మించారు.
ఈ అరుదైన అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ఆవిష్కరించనున్నారు. స్మృతివనాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు. ఇవాళ సాయంత్రం 4.30గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం స్వరాజ్ మైదాన్ చేరుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
విజయవాడలో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి బెంజిసర్కిల్ వరుకు బందర్ రోడ్ మూసివేశారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ బందర్ రోడ్లో ఈ ఆంక్షలు అమలుచేస్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే భారీ వాహనాలను ఇబ్రహీం పట్నం నుంచి జీ కొండూరు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాల్ని కూడా హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, అవనిగడ్డ, రేపల్లె, చీరాల, ఒంగోలు మీదుగా పంపిస్తున్నారు. గుంటూరు నుంచి విశాఖ వెళ్లే వాహనాల్ని బుడంపాడు నుంచి తెనాలి, వేమూరు, అవనిగడ్డ, గుడివాడ, జంక్షన్ మీదుగా , చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని బాపట్ల జిల్లా మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ స్మృతివనం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు 404.35 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేద్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్వర్క్ ఏర్పాటుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించారు.
విగ్రహం బేస్ కింది భాగంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2వేల 250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం.
మినీ థియేటర్లు, ఫుడ్కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6వేల 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2వేల మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్కోర్టు 8వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర్ పీఠంను రూపొందించారు. విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్కు చెందిన పింక్ రాక్ను ఉపయోగించారు.
అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేద్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.