Anantapur : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీలో మరో మంత్రికి స్థాన చలనం కలగడం హాట్ టాపిక్ గా మారింది. మంత్రి ఉష శ్రీ స్వయంగా ఈ ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో కళ్యాణ దుర్గం నుంచి కాకుండా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం ఆదేశాలను పాటిస్తానని మేము ఎక్కడికి వెళ్లినా.. ఒక్కటే నినాదం.. అది జగన్ నినాదం అని మంత్రి వెల్లడించారు.
ఇన్ని రోజులు కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో ఆదరించారని.. వారి రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని మంత్రి అన్నారు. సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో భాగంగా.. కళ్యాణదుర్గం స్థానాన్ని బోయలకు కేటాయించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఎక్కడైనా సరే జగన్ ను, ఫ్యాన్ గుర్తునే చూస్తున్నారని ఉషశ్రీ స్పష్టం చేశారు.
మరోవైపు టికెట్ మార్పుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. టికెట్ మారుస్తునట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు. జగన్ ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తామని.. పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు.