Nellore Politics : హూందా రాజకీయం చేస్తుంటారు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. కాంగ్రెస్లో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను కంటిచూపుతో శాసించారాయన. అయితే వైసీపీలో చేరాక అటువంటి సీనియర్కి కాలం కలిసి రాలేదు. మంత్రిపదవి దక్కలేదు కదా పార్టీలో అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందాయనకి. దీంతో తెలుగుదేశం దారి పట్టారు. ఇక ఇప్పుడు టీడీపీ అభ్యర్ధిగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన తిరిగి వెంకటగిరి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారా? వెంకటగిరి కాకపోతే ఎక్కడ నుంచి బరిలో ఉంటారు?
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలియని వారు ఉండరు. ఏ పార్టీలో ఉన్నా అరుదైన ప్రత్యేకతతో రాజకీయాలను రక్తి కట్టిస్తారు. ప్రస్తుతం ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి రావడంతో.. వెంకటగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని రాజకీయ వర్గాలు భావించినా తాజాగా ఆయన ప్రకటనలు వెంకటగిరి నుంచి పోటీ చేయడానికే ఇష్టపడుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. దాంతో వెంకటగిరి రాజకీయం మరోసారి వేడెక్కింది.
ఆనం రామనారాయణ నిజంగా వెంకటగిరి నుంచి పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ సారి వెంకటగిరి వేదికగా పోటీ చేసేందుకు ఆనంకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఏం జరిగినా ఆనం వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ వేడి రగిలించారనే చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల చర్చల్లో వెంకటగిరి ఒక టాపిక్ అయింది. ఎందుకంటే అక్కడ వైసీపీ ఇన్చార్జ్గా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డితో తలపడనుండటం రెండు పార్టీల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. ఎవరు గెలుపు గుర్రాలు అన్నదానిపై సర్వత్ర చర్చ సాగుతోంది. ఇప్పటికే వెంకటగిరి రాజకీయాలు వేడెక్కాయి. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులు ఈ సెగ్మెంట్లో బహిరంగసభలు నిర్వహించడంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఆనం రామనారాయణకొన్ని నెలల క్రితమే అధికార పార్టీతో విభేదించి పార్టీతో పాటు ప్రభుత్వంపై విమర్శలు చేసి బయటకొచ్చారు.
ఆనం వైసీపీని వీడిన తరుణంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలోఅడుగు పెట్టింది. తెలుగుదేశం పార్టీ టచ్ లో ఉన్న ఆనంకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యాత్ర బాధ్యతలు చంద్రబాబు సూచించారన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే యువగళం యాత్రపై ఆనం మార్క్ కనిపించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో లోకేశ్ ప్రవేశిస్తున్న సమయంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఆ ప్రాంతం జన సంద్రాన్ని తలపించింది. లోకేష్ నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టగానే భారీఎత్తున బాణాసంచా కాల్చుతూ హోరెత్తించారు. ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి స్వాగతం పలికిన వారిలో ముందున్నారు.
దాంతో ఆత్మకూరు నుంచి పోటీ చేసేందుకు ఆనం సిద్దమైనట్లు ప్రచారం మొదలైంది. 2009లో ఆనం ఆత్మకూరు ఎమ్మెల్యేగా పనిచేసి ఉండటంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపించింది. 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటమి అనంతరం ఆత్మకూరు క్యాడర్లో మనోధైర్యం నింపి, నడిపించే నాయకుడే కరువయ్యారు. దాంతో ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు వస్తారన్న ప్రచారం. అక్కడి కార్యకర్తలు పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపినట్లైంది. అయితే పాదయాత్ర తర్వాత అటు పార్టీ పరంగా, ఇటు ఆనం నుంచి ఎలాంటి కదలికా లేకపోవడంతో ఆత్మకూరు తమ్ముళ్లు ఢీలా పడిపోతున్నారు.
మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తే వెంకటగిరి నియోజకవర్గ నుంచి కురుగోండ్ల రామకృష్ణ పోటీలో ఉంటారని సంకేతాలు వెలువడ్డాయి. దాంతో ఇద్దరికీ లైన్ క్లియర్ అయింది అనుకుంటున్న టైంలో రివర్స్ గేర్ పడినట్లుయింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి టీడీపీ టికెట్ తనకేనని ఆనం పరోక్షంగా అంటున్నారంట. చంద్రబాబు ఆదేశిస్తే వెంకటగిరి నుంచి పోటీలో చేస్తానని తాను అనుకున్న విధంగానే ఈసారి చంద్రబాబు అవకాశం ఇస్తారని శాసనసభ్యున్ని ఏ విధంగా గౌరవించాలో చంద్రబాబుకు తెలుసని వ్యాఖ్యానిస్తున్నారాయన.
దాంతో ఆనం వెంకటగిరి వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్లమవుతోంది. మరి ఆనం వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల ఆత్మకూరులో జరిగిన చంద్రబాబు. రా కదిలిరా.. బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కురుగొండ్ల రామకృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. వెంకటగిరి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఏకైక నేత కురుగొండ్ల రామకృష్ణ. మరి ఇక్కడి నుంచి ఆనం రామనారాయణరెడ్డి బరిలో నిలిస్తే కురుగొండ్ల రామకృష్ణ పరిస్థితి ఏంటని ఆయన అనుచరులు మధన పడుతున్నారు.
మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో కాని ఒకవేళ ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి టీడీపీ టికెట్ దక్కితే ప్రస్తుత టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ దానికి అంగీకరిస్తారా? కురుగొండ్ల వర్గం ఆనంకు సహకరిస్తుందా? ఒకవేళ వెంకటగిరి టికెట్ దక్కకపోతే ఆనం రామనారాయణ ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న అంశాలు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
.
.