AMRUTH: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అనేది పెద్దలు చెప్పిన మాట. ఆ మాటను నిజం చేసి చూపించాడు.. విజయనగరంకు చెందిన 24 ఏళ్ల అమృత్ అనే యువకుడు. చీపురుపల్లికి చెందిన అమృత్ అంగవైకల్యంతో జన్మించాడు. అతడు కేవలం తల, రెండు చూపుడు వేళ్లను మాత్రమే కదిలించగలడు. ఇక ఏ పనులు చేయాలన్నా ఇతరుల సహాయం తీసుకోవాల్సిందే.
అతడిని తల్లిదండ్రులు ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా లాభం లేకుండా పోయింది. ఎంత వైద్యం అందించినా అవయవాలు పనిచేయవని వైద్యులు తేల్చి చెప్పారు. అయినా కూడా అమృత్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువులో రాణించాడు. టెన్త్తో ఫస్ట్ క్లాసులో పాస్ అయిన అమృత్.. ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని 940 మార్కులు సాధించాడు.
ఆ తర్వాత డిగ్రీలో బీకాం తీసుకొని 2021లో గ్రాడ్యుయేషన్ పట్టాపొందాడు. ఆ తర్వాత ఎంతో కష్టపడి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ఇంటి దగ్గరి నుంచే ఉద్యోగం చేస్తూ.. తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నాడు.