Amrapali Kata IAS : ఏపీలో రిపోర్ట్ చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు ఇవాళ చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందే కేంద్రం, డీఓపీటీ ఆదేశాలతో తెలంగాణలో పనిచేస్తున్న నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీకి వెళ్లారు.
గురువారం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ను కలిసి రిపోర్ట్ చేశారు. దీంతో ఐఏఎస్ ఆఫీసర్ల అంతర్రాష్ట్ర బదిలీల కథ తాత్కాలికంగా సుఖాంతమైంది. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి, రోనాల్డ్ రోస్ సీఎస్ ను కలిసి తమ జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు.
సర్వత్రా ఆసక్తి…
ఇక ఈ నలుగురు ఐఏఎస్ ఆఫీసర్లకు ఎలాంటి శాఖలు కేటాయించనున్నరోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో ఆమ్రపాలీకి ఏ శాఖ ఇవ్వనున్నారోనన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. దీంతో ఆమెను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన టీంలోకి తీసుకోనున్నారని సమాచారం. ఈ క్రమంలోనే నేడో రేపో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది.
పవన్ శాఖల్లో ఆమ్రపాలి ?
డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న ఆమ్రపాలీని కేంద్రం నుంచి రప్పించిన తెలంగాణ సర్కార్, కీలకమైన జీహెచ్ఎంసీ కమిషనర్ గా పోస్టింగ్ నియమించింది. గతంలోనూ ఆమె ప్రధాని కార్యాలయం పీఓంలోనూ విధులు నిర్వర్తించారు. అక్కడ దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించారు. సుదీర్ఘకాలం కేంద్రం, తెలంగాణలో పనిచేసిన ఆమ్రపాలి ఇప్పుడు ఏపీలో పనిచేయనున్నారు. దీంతో పవన్ కల్యాణ్ ఆమె సేవలను తన శాఖలోనే వినియోగించుకోనున్నారని ప్రభుత్వ వర్గాల్లో ఓ చర్చ మొదలైంది. ఇప్పటికే కేరళ కేడర్ కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను పవన్ తన ఓఎస్డీగా నియమించుకున్నారు. పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవులు, పర్యావరణం లాంటి శాఖలను నిర్వర్తిస్తున్న డీప్యూటీ సీఎం, ఈ నలుగురు ఐఏఎస్ అధికారుల్లో మెజారిటీ వాళ్లకు బాధ్యతలు అప్పగించనున్నారట.
వైజాగ్ అంటే ఆమెకు తెలియంది ఏమీ లేదు…
సొంతూరు ప్రకాశం జిల్లా అయినప్పటికీ ఆమ్రపాలికి వైజాగ్ అంటే కొట్టినపిండే. అక్కడే చదవుకున్నారు కూడానూ. ఆమె తండ్రి వెంకట్ రెడ్డి ఏయూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించారట. దీంతో వైజాగ్ మున్సిపాలిటీ కమిషనర్ గానూ ఈమెను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.