Ambati Rayudu: క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. గతేడాది డిసెంబర్ 28న అంబటి రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.వైసీపీ నుంచి గుంటూరు ఎంపీ ఆశించిన అంబటి రాయుడికి నిరాశ ఎదురైంది. వైసీపీ నుంచి ఎంపీ టికెట్ రాకపోవడంతోనే అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఈ మేరకు X లో ట్వీట్ చేశారు. త్వరలోనే తన రాజకీయ జీవితంపై మరో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ రెండు విడతలుగా నియోజకవర్గ ఇన్ చార్జుల లిస్టులు ప్రకటించగా.. వీటిలో చాలామంది సీనియర్లకు అధిష్టానం మొండిచేయి చూపించింది. దాంతో.. పార్టీనే నమ్ముకుని ఉన్నవారు మోసపోయామంటూ పార్టీని వీడుతున్నారు. మరికొంతమంది నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు సమాచారం. బాలినేని శ్రీనివాసరెడ్డి సహా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో.. పార్టీలో ప్రకంపనలు మరింత ఎక్కువయ్యాయి. వైసీపీని వీడిన రాయుడు.. తర్వాత ఏ పార్టీవైపు అడుగులేస్తారో చూడాలి.