ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ స్థానాలకు.. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుంది. మరో ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన అంబటి రాయుడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెవలగా.. కప్పుతో సహా వచ్చి సీఎం జగన్న కలిశారు అంబటి రాయుడు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు సార్లు సీఎంతో భేటీ అయ్యారు. దీంతో.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని, అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకోబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదిలా ఉంటే.. రాయుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ.. స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ అయిన వైసీపీ చేపడుతున్న కార్యాక్రమాల్లో విధిగా పాల్గొంటుండటం గమనార్హం. దీంతో.. అంబటి రాయుడు వైసీపీలో చేరటం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై అంబటి రాయుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని ఎస్ఆర్టీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాయుడు.. పొలిటికల్ ఎంట్రీపై నోరువిప్పారు. అంతే కాదు జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. డిసెంబర్ 9న వైసీపీలోకి అంబటి రాయుడు ఎంట్రీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. వైసీపీ తరపున గుంటూరు ఎంపీ పోటీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.