Ambati: బ్రో..బ్లోఅవుట్ అవుతోంది. పొలిటికల్ రచ్చ నడుస్తోంది. అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నారు. జనసేన సైరా అంటోంది. బ్రో వర్సెస్ మ్రో నుంచి మ్రో వర్సెస్ SSS గా మారింది. శ్యాంబాబు, రాంబాబు, బ్రో, మ్రో, SSS.. ఇలా ఏపీలో కాక రేగుతోంది.
శ్యాంబాబు రోల్తో తనను బ్లేమ్ చేస్తారా.. మీ సంగతి చూస్తానంటూ పంతం పట్టినట్టున్నారు మంత్రి అంబటి రాంబాబు. మంగళవారం మీడియా ముందుకు వచ్చి.. పవన్ పెళ్లిళ్లపై తానూ ఓ సినిమా చేస్తానంటూ రకరకాల పేర్లు చెప్పారు. అక్కడితో ఆగిపోలేదు. పవన్కు రెమ్యునరేషన్ ఇచ్చింది టీడీపీయే అంటూ మరింత రాజకీయ కలకలం రేపారు.
అంబటి చెప్పిన సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయన్నారు. చంద్రబాబు, అతని ముఠా సభ్యులు యూఎస్లో డబ్బులు కలెక్ట్ చేసి విశ్వప్రసాద్కు ఇస్తున్నారని చెప్పారు. ఆ డబ్బులను పవన్కు ఇచ్చి సినిమా పేరుతో.. బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారని.. ఆ విధంగా జనసేనానికి టీడీపీ ప్యాకేజీ అందిస్తోందని ఆరోపించారు అంబటి రాంబాబు. తాను తీసుకున్న రెమ్యునరేషన్కు పవన్ ట్యాక్స్ కడుతున్నారా? అని కూడా ప్రశ్నించారు.
అంబటి వ్యాఖ్యలకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సైతం స్పందించారు. అంబటికి తాను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని.. దర్యాప్తు సంస్థలు అడిగితే అన్ని వివరాలు అందిస్తానని అన్నారు. పవన్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పేదే లేదన్నారు.
జస్ట్ ఆరోపణలతోనే ఆగిపోలేదు అంబటి రాంబాబు. బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలు, విదేశాల నుంచి నిధులపై దర్యాప్తు చేయాలంటూ.. ఢిల్లీ వెళ్లి జాతీయ ఏజెన్సీలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే పవన్ను ప్యాకేజీ స్టార్ అంటూ పదే పదే విమర్శిస్తోంది వైసీపీ. ఇప్పుడు ఆ ప్యాకేజీ ఎక్కడి నుంచి వస్తుందో చూడా చెప్పేసింది. నిజంగానే సినిమా రెమ్యునరేషన్ రూపంలో టీడీపీనే పవన్కు డబ్బులు ఇస్తుందో లేదో తెలీదు కానీ.. ఈలోగా అంబటి ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతోంది. నిజమేనా? విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయా? ఆ డబ్బులు టీడీపీనే ఇస్తోందా? పవన్కు ప్యాకేజీ అందుతోందా? ఇలా రకరకాల అనుమానపు ప్రశ్నలు. మరి, నిజాలేంటో ఎవరికీ తెలీదు. అంబటి ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారమే లేపేలా ఉన్నాయి. వీటికి జనసేనాని రియాక్షన్ ఏంటో చూడాలి.