Ambati : పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ చేసిన అవినీతి ఆరోపణలపై మంత్రి చాలెంజ్ విసిరారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. తాను కాదు పవనే కాపుల గుండెలపై కుంపటి అని విమర్శించారు. కాపులను చంద్రబాబుకు తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును పోలవరం గురించి ఏ రోజైనా ప్రశ్నించావా? అని అంబటి రాంబాబు పవన్ ను నిలదీశారు.
ఓట్లు చీలనివ్వను, వైసీపీని గెలనివ్వనన్న జనసేనాని వ్యాఖ్యలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తానని చెప్పడమే పవన్ ఉద్దేశమని అంబటి విమర్శించారు. బీజేపీకి ఇదే మెసేజ్ పంపించారని అన్నారు. పవన్ సిద్ధాంతం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు వెంటే నడుస్తానని పవన్ మరోసారి చెప్పారని అంబటి మండిపడ్డారు. చంద్రబాబును సీఎం చేసేందుకే వచ్చానని డైరెక్ట్గా చెప్పొచ్చుగా అని సెటైర్లు వేశారు. కలిసి పోటీ చేసి ఉంటే బాగుండేది అంటూ డొంక తిరుగుడు ఎందుకు? అని ప్రశ్నించారు. తప్పు చేస్తే చొక్కా పట్టుకోమని పవన్ చెబుతున్నారని టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజలు పవన్ చొక్కా పట్టుకోవడం ఖాయమని అంబటి స్పష్టం చేశారు. పవన్కు ఉన్నది చంద్రబాబు ఆలోచనే. ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి వాహనంపై మంత్రి అంబటి కామెంట్స్ చేశారు. ఆ వాహనం పేరును వరాహం అని పేరు పెట్టుకోవాలని సూచించారు. వారాహి అమ్మవారి పేరు మార్చుకోకుంటే పవన్ భ్రష్టుపట్టిపోతారని అన్నారు. బీసీల సమావేశంపై పవన్ ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వం కంటే బీసీలకు మేలు చేసిన పార్టీ వైసీపీనే అని స్పష్టం చేశారు.