Pawan Kalyan Vs YCP : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ జనసేనాని యాత్ర సాగించారు. తొలి విడత వారాహి యాత్రను భీమవరంలో ముగించారు. ఇక్కడ సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేశారు. జగన్ హైదరాబాద్ లో ఏం చేశారో తనకు తెలుసని అన్నారు.
భీమవరంలో పవన్ కల్యాణ్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. రౌడీలా, అసాంఘిక శక్తిలా మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వైసీపీ నాయకులను తిట్టడమేనా పవన్ పాలసీ? అని నిలదీశారు. ఆ మాటలు విని నవ్వాలో, ఏడవాలో ప్రజలకు అర్థం కావడం లేదన్నారని సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ మాటమాటకి తానో విప్లవ వీరుడని అంటున్నారని అయితే ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
3 పెళ్లిళ్ల వీరుడు పవన్ కల్యాణ్ నీతులు చెబితే హాస్యాస్పదంగా ఉందని అంబటి రాంబాబు చురకలు అంటించారు. 3 పెళ్లిళ్లు చేసుకోవడమేనా పవన్ చెప్పే ఆదర్శమా అని నిలదీశారు. జగన్ పోవాలంటున్న పవన్.. ఎవరు రావాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని అంబటి తేల్చిచెప్పారు. సినిమా పిచ్చి, కుల పిచ్చితో యువత పవన్ కల్యాణ్ అనుసరించ వద్దని సూచించారు.
పవన్ కల్యాణ్ విమర్శలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు. జనాలను మోసం చేసే పార్టీ జనసేన అని అన్నారు.పేదలు సుఖంగా ఉంటే పవన్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ముద్రగడను చంద్రబాబు ఏ రకంగా హింసించారో తెలియదా? ప్రశ్నించారు. జనసేన అంటే ప్యాకేజీ పార్టీ అని ఆరోపించారు. పుచ్చలపల్లి సుందరయ్య, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయుల పేర్లు ఉచ్చరించే అర్హత పవన్కు ఉందా? అని నిలదీశారు. పవన్ కుటిల రాజకీయం గమనించే 2019లోనే ప్రజలు బుద్ధి చెప్పారని గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు.
మరోవైపు పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. జూలై 9న ఏలూరు నుంచి యాత్ర చేపట్టనున్నారు. అంతకుముందు జూలై 6,7,8 తేదీల్లో రాజమండ్రిలో పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు.