Amaravati: లేచామా, తిన్నామా, పన్నామా.. అంటూ పోకిరీ సినిమా డైలాగ్ గుర్తుందిగా. ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయినా.. దాని జీవితకాలం కొన్ని రోజులే. జనం మరో ఫ్రెష్ న్యూస్ వైపు మళ్లిపోతారు. కానీ, అరుదుగా మాత్రమే కొన్ని ఘటనలు సుదీర్ఘకాలం జరుగుతుంటాయి. తెలంగాణ ఉద్యమం, ఢిల్లీలో రైతుల పోరాటం.. ఇలా ఆ కోవలోకే వస్తుంది అమరావతి రాజధాని రైతుల ఉద్యమం.
ఒకటి రెండు కాదు.. ఏకంగా 1200 రోజులవుతోంది రైతులు రోడ్డెక్కి. మూడేళ్లు దాటేసింది. ప్రభుత్వం మెట్టు దిగలేదు, రైతులు వెనక్కి తగ్గలేదు. వీళ్లు పోరాడుతూనే ఉన్నారు.. పాలకులు పక్కనుండి వెళ్లిపోతూనే ఉన్నారు. మధ్యలో అనేక అవమానాలు, కేసులు, శిక్షలు, లాఠీదెబ్బలు. అన్నిటినీ భరిస్తున్నారు రైతులు. అమరావతి కోసం ధృడ సంకల్పంతో ఉద్యమిస్తున్నారు. పాదయాత్రలు చేసినా.. నిరవధిక దీక్షలు చేసినా.. కన్నెర్ర జేసిన వాళ్లు కరిగిపోవటం లేదు. అందుకే, న్యాయస్థానాన్నే నమ్ముకున్నారు. హైకోర్టు తీర్పు కాస్త ఊరట నిచ్చినా.. పాలకుల పంతంతో పరిస్థితి ఏమాత్రం మారనేలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేస్తున్నారు. మూడేళ్ల మారథాన్ పోరాటంలో అనేక మంది రైతులు అసువులు బాసారు. భావితరం కూడా పుట్టుకొచ్చింది. రాజధాని రాత ఎప్పటికైనా మారకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు భూములిచ్చిన రైతులు.
తామిచ్చిన భూమి తమది కాకుండా పోతోంది. వేరే వారికి రాసిచ్చేస్తారని తెలిసి.. ఒళ్లు రగిలిపోతోంది. ఆకాశహర్మ్యాలతో అలరారాల్సిన అమరావతికి స్మశానంతో పోలికొచ్చింది. వేసిన రోడ్లు మాయమయ్యాయి. తుమ్మపొదలతో.. నగరానికి చెద పట్టినట్టైంది. ఎంతకాలం? ఇంకెంతకాలం? మూడు రాజధానుల్లో ఒక భాగంగా సరిపెట్టుకోవాలా? ఏకైక రాజధాని కోసం అలుపెరగకుండా పోరాడాలా? రెండో ఆప్షన్నే ఎంచుకున్నారు రాజధాని రైతులు. అమరావతి ఉద్యమానికి 1200 రోజులు అయిన సందర్భంగా మరోసారి తమ గళాన్ని బలంగా వినిపించారు. అధికార వైసీపీ మినహా అన్నిపార్టీలు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు తెలిపాయి.
అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని.. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రైతుల పోరాట స్ఫూర్తిని అభినందించారు. అమరావతి ఉద్యమం వైసీపీ ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు చంద్రబాబు.
మందడంలో జరిగిన అమరావతి సభకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చీఫ్ ప్రత్యక అతిథిగా హాజరయ్యారు. అమరావతి నుంచి ఒక్క మట్టిపెళ్ల కూడా వైసీపీ ప్రభుత్వం కదిలించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వ్యతిరేక శక్తులు కొట్టుకుపోతాయన్నారు. “రాజధాని అమరావతి 29 గ్రామాలది కాదు.. ప్రపంచంలోని కోట్లాది తెలుగువారిది”.. అని అన్నారు కోటంరెడ్డి.
దేశచరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమం ఇదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. జులైలో సుప్రీంకోర్టు తీర్పుతో జగన్ ఏడవడం ఖామమన్నారు. పోలీసుల అండ లేకుండా అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ తిరగలేకపోతున్నారని అన్నారు.