Aluru | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీసీ మార్పులు, చేర్పుల వ్యవహారం పలు నియోకజవర్గాల్లో వివాదాలకు దారితీస్తోంది. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో .. తాజా అభ్యర్థులకు అక్కడ సిట్టింగులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా తన నియోజకవర్గం మార్చడంతో ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Aluru | ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీసీ మార్పులు, చేర్పుల వ్యవహారం పలు నియోకజవర్గాల్లో వివాదాలకు దారితీస్తోంది. పోటీ చేసే స్థానాలు మారిపోవడంతో .. తాజా అభ్యర్థులకు అక్కడ సిట్టింగులు సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా తన నియోజకవర్గం మార్చడంతో ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ కీలక నేతలు ఫోన్ చేసినా.. ఆయన అందుబాటులోకి రావడం లేదట.. దాంతో అసలు మంత్రి జయరాం అజ్ఞాతం వెనుక కారణం ఏంటని ఆరాలు తీస్తున్నారంట వైసీపీ పెద్దలు.
మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం వైసీసీలో చర్చనీయాంశంగా మారింది. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను ఆలూరు నుంచి తప్పించి కర్నూలు ఎంపీ అభ్యర్ధిగా ప్రకటించింది వైసీపీ. ఆలూరు ఇన్చార్జ్గా జయరాం వ్యతిరేక వర్గానికి చెందిన జడ్పీటీసీ విరుపాక్షను ప్రకటించింది. దాంతో మంత్రి తీవ్ర అసంతప్తితో ఉన్నారంటున్నారు.
ఆ క్రమంలో జయరాం కొన్ని రోజులుగా పలువురి ఫోన్లకు స్పందించడం లేదట. తన రాకపోకలనూ గోప్యంగా ఉంచుతున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కర్నూలు ఎంపీగా పోటీచేయడానికి జయరాం సిద్దంగా లేరంటున్నారు. ఆలూరు సెగ్మెంట్లో జయరాం బంధుమిత్రులు, రక్తసంబంధీకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదీకాక ఆలూరు సెగ్మెంట్కు స్థానికుడైన ఆయన రాజకీయ జీవితం ప్రారంభైంది కూడా అక్కడే.
జయరాం 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆయన 2005లో ఆలూరు సెగ్మెంట్లోని చిప్పగిరి మండల జెడ్పీటీసీగా గెలుపొందారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2011లో వైసీపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన 2014, 2019 ఎన్నికల్లో ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రయ్యారు. ఆయనకు ముందు నుంచి నియోజకవర్గం వాసులతో కలుపుగోలుగా ఉంటారన్న పేరుంది. అందుకే అంత అనుబంధం ఉన్న ఆలూరును వదులుకోవడానికి ఆయన సుముఖంగా లేరంట. కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినా .. ఆయన తిరస్కరిస్తున్నారు.
ఆ క్రమంలో జయరాం పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రిని కలిసేందుకు వైసీపీ ఆలూరు ఇన్చార్జ్గా ప్రకటించిన విరూపాక్షి కొద్దిరోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుబాటులోకి రావడం లేదంట. పోలీసులు ఇచ్చిన సమాచారంతో మంత్రి ఇంట్లో ఉన్నారని నిర్ధారించుకుని ఈనెల 18న విరూపాక్షి నేరుగా గుమ్మనూరు ఇంటికి వెళ్లారు. మంత్రి వాహనాలు ఇంట్లోనే ఉన్నా.. అనుచరులు మాత్రం.. మంత్రి ఇంట్లో లేరని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వెనుదిరగాల్సి వచ్చిందంట.
అటు వైసీపీ పెద్దలకూ జయరాం అందుబాటులోకి రావడం లేదంటున్నారు. దీంతో అసలేం జరుగుతోందో తెలియక పార్టీనేతలు తలలు పట్టుకుంటున్నారంట.. మరోవైపు గుమ్మనూరు పార్టీ మారుతారన్న ప్రచారం వాస్తవం కాదని ఆయన సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. అయితే, ఎంపీగా పోటీ చేయడం ఆయనకు ఇష్టం లేదని, ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్తున్నారు.
అదలా ఉంటే గుమ్మనూరు జయరాం ఇటీవల అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొందుతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో బెంగళూరు కేంద్రంగానే పార్టీ మార్పుపై పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గుమ్మనూరు జయరాం ఎంపీ పదవిని పోటీ చేయడానికి ఇష్టం లేకపోవడంతో వైసీపీ అధిష్టానానికి డెడ్లైన్ పెట్టారని అంటున్నారు. ఆలూరు వైసీపీ టికెట్ దక్కకపోతే పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అవ్వడంతో .. ఇప్పటికే ఆయన కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో టచ్లోకి వెళ్లారంటున్నారు.. ఇది తెలిసి ఆయన్న తాడేపల్లికి పిలిపించుకుని బుజ్జగించాలని చూస్తున్నారంట వైసీపీ పెద్దలు. మరి చూడాలి వారి బుజ్జగింపులు ఎంత వరకు ఫలిస్తాయో?.. గమ్మునున్న గుమ్మనూరు ఎప్పటికి తన నిర్ణయం ప్రకటిస్తారో?
Aluru, Minister Jayaram, disgruntled, ticket denial, YSRCP, kURNOOL, AP POlitics, Virupaktshi,