AP EC CEO Mukesh Kumar Meena Press Meet : ఏపీలో నెక్ట్స్ సీఎం ఎవరు ? వైసీపీ అధికారాన్ని నిలుపుకుంటుందా ? కూటమి పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా ? లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఒకవైపైతే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోవైపు. ఈ రణరంగంలో గెలిచేదెవరు ? ప్రతిపక్షంలో నిలిచేదెవరు? కౌంట్ డౌన్ గడియారం ఆగడంతో ఆరంభమయ్యే ఓట్ల లెక్కింపుల ప్రక్రియలో అధికారంలోకి వచ్చేదెవరో తేలనుంది. అంతవరకూ గుండెను అరచేత్తే పట్టుకుని కూర్చోవాల్సిందే.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు , 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. గతంలో కంటే ఎక్కువగా ఈసారి పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయని తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా.. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను నియమించినట్లు వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ హాల్ లో ఏజెంట్లు ఉంటారని, ప్రతి కౌంటింగ్ సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు.
Also Read : ఎగ్జిట్ పోల్స్పై సజ్జల అసహనం, కేవలం రెండేనట
ఈసారి జరిగిన ఎన్నికల్లో 3.33 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. వీరిలో 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా, 26,721 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానిక్ విధానంలో ఓటేశారని వివరించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు.. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మీడియా మినహా ఎవరికీ మొబైల్ ఫోన్లను అనుమతించబోమని తెలిపారు.
అమలాపురంలో 27 రౌండ్ల లెక్కింపు ఉంటుందని, ఫలితానికి 9 గంటల సమయం పట్టవచ్చని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 13 రౌండ్లు ఉండగా.. ఫలితాలకు 5 గంటలు, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లలో ఫలితాలు వెలువడతాయని తెలిపారు. కొవ్వూరు, నరసాపురం స్థానాల్లో ఫలితాలు 5 గంటల్లో వస్తాయన్నారు. తొలి ఫలితం నందిగామ, పామర్రు స్థానాల నుంచి రావొచ్చని చెప్పారు.