ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ గొడవలు మళ్లీ మొదలయ్యాయా? పోలింగ్ మర్నాడు ఏం జరిగింది? టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్ మర్డర్కు ప్లాన్ చేసిందెవరు? తొలుత ఏవీ సుబ్బారెడ్డి హస్తముందని వార్తలొచ్చాయి. ఇప్పుడు వైసీపీ నేతల వైపు మళ్లుతోందా? ఇలా రకరకాల అనుమానాలు మొదలయ్యాయి.
మంగళవారం రాత్రి ఆళ్లగడ్డలో అఖిలప్రియ బాడీగార్డు నిఖిల్పై హత్యకు ప్లాన్ జరిగింది. మిడ్ నైట్ రోడ్డులో ఓ వ్యక్తితో మాట్లాడుతుండగా వేగంగా వచ్చిన కారు, ఆయనను హిట్ కొట్టింది. కారు ముందుకెళ్లిన తర్వాత అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు బయటకు దిగి నిఖిల్ను వెంబడించారు. అక్కడి నుంచి బాధితుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనకు పాతకక్షలే అనుకున్నారు. ఈ వ్యవహారం వైసీపీ వైపు మళ్లినట్టు కనిపిస్తోంది.
శుక్రవారం మీడియాతో మాట్లాడారు భూమా అఖిలప్రియ. జరిగిన ఘటనపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. తమకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. కాంట్రాక్టు వ్యక్తులను తీసుకొచ్చి నిఖిల్ను చంపేందుకు ప్లాన్ చేశారని ఆరోపించారు. నంద్యాలలో రౌడీలు, గుండాలుగా తిరిగే చిల్లర బ్యాచ్ ఇక్కడ హంగామా చేస్తోందన్నారు.
Also Read: ఈసారి కింగ్ ఎవరు? కచ్చితంగా అదే ఫిగర్, జగన్ మాటలు..
వైసీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి చేసిన కామెంట్స్పై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను బౌన్సర్లను రప్పించుకున్నానంటూ చెప్పడంపైనా ఆగ్రహం వ్యక్తంచేశారు. బయట నుంచి వ్యక్తులు ఆళ్లగడ్డకు ఎందుకు వచ్చారన్న ఆరోపణలపైనా కౌంటరిచ్చారామె. కనీసం ఆయనకు బుద్ది ఉందా అంటూ ప్రశ్నించారు. నంద్యాలలో తిరిగే కాంట్రాక్ట్ వ్యక్తులు ఆళ్లగడ్డలో ఎందుకున్నారని అన్నారు.
పోలింగ్ రోజు తనతో తిరిగిన వ్యక్తులకు ఇక్కడ ఓటు ఉందని గుర్తు చేశారు అఖిలప్రియ. శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు చెప్పడంతో అప్పుడు ఫిర్యాదు చేశామన్నారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారన్నారు. అందుకోసం తాము వెయిట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. లేదంటే ఆ వ్యక్తికి న్యాయం జరిగేటట్టు తాము చేసుకుంటామన్నారు. నిఖిల్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ-టీడీపీ మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది.