Adudham Andhra : గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. బ్యాడ్మింటన్ ఆటగాడు కిందాంబి శ్రీకాంత్ తో సీఎం జగన్ క్రీడా జ్యోతిని వెలిగించారు. స్పోర్ట్స్ కిట్స్ను సీఎం జగన్ పరిశీలించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రికెట్ కిట్స్, వాలీబాల్ కిట్, బ్యాడ్మింటన్ కిట్లను క్రీడాకారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.09 లక్షల స్పోర్ట్స్ కిట్ల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీ, కొందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆటల్లో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ చాలా అవసరమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ క్రీడా వేడుకలు దేశ చరిత్రలోనే మైలురాయిగా పేర్కొన్నారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. ఆటలు ఆడటం వల్ల బీపీ, డయాబెటిక్ లాంటి వ్యాధులు అదుపులో ఉంటాయని వివరించారు. గ్రామస్థాయిలో క్రీడలు ఎంతో అవసమని ఆణిముత్యాల లాంటి ఆటగాళ్లను వెతికి దేశానికి అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామస్థాయి క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లటమే లక్ష్యమని స్పష్టం చేశారు.
15,004 గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం 9 వేల మైదానాలను సిద్ధం చేశారు. 5 దశల్లో పోటీల నిర్వస్తారు. రూ.12కోట్లకుపైగా నగదు బహుమతులు అందజేస్తారు. 3.33 లక్షల జట్లు పోటీ పడేందుకు 9,478 క్రీడా మైదానాలను సిద్ధం చేశారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10 వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు జరుగుతాయి.
జనవరి 9 నాటికి గ్రామ/వార్డు సచివాలయాల స్థాయిలో పోటీలు ముగుస్తాయి. జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో పోటీలు జరుగుతాయి. జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో క్రీడలు నిర్వహిస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు జిల్లా స్థాయిలో పోటీలు సాగుతాయి. ఫిబ్రవరి 6వ నుంచి 10 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇలా 47 రోజుల పాటు ఈ క్రీడా ఈవెంట్ జరుగుతుంది.