Addanki YSRCP Politics | ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఇన్చార్జ్గా పాణెం హనిమిరెడ్డిని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. హనిమిరెడ్డి స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అనుచరుడే ఈ పాణెం హనిమిరెడ్డి. వైవీ ఆశీస్సులతో అద్దంకి వైసిపి ఇన్చార్జ్గా అవకాశం దక్కించుకున్నారు.
Addanki YSRCP Politics | రాష్ర్ట వ్యాప్తంగా వైసీసీ వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులను మారుస్తుండటం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. కొన్ని చోట్ల ఇన్ఛార్జుల మార్పులు ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానానికి తల నొప్పిగా మారుతున్నాయి. కొత్త ఇన్చార్జ్ పార్టీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇన్చార్జ్ కూడా ఆయా ప్రాంతాల నేతలతో కలిసి మీటింగులు పెట్టి సమాలోచనలు చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే అక్కడ హ్మాట్రిక్ విజయాలతో బలంగా ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఆయన ఓటమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న అధికారపక్షానికి కొత్త, పాత ఇన్చార్జుల విభేదాలతో ఎటూ పాలుపోవడం లేదంట. ఇంతకీ ఎక్కడా పరిస్థితి అంటారా?
ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం ఇన్చార్జ్గా పాణెం హనిమిరెడ్డిని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. హనిమిరెడ్డి స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు. వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అనుచరుడే ఈ పాణెం హనిమిరెడ్డి. వైవీ ఆశీస్సులతో అద్దంకి వైసిపి ఇన్చార్జ్గా అవకాశం దక్కించుకున్నారు. అద్దంకి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హనిమిరెడ్డి సెగ్మెంట్లోని అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు. మండలాల నేతలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి సోదరుడు వైవీ భద్రారెడ్డి.. హనిమిరెడ్డి వెన్నంటే ఉంటూ సహకరిస్తున్నారు.
గతంలో హనిమిరెడ్డికి ముందు అద్దంకి ఇన్చార్జ్గా ఉన్న బాచిన కృష్ణచైతన్యకు ద్వితీయ శ్రేణి నేతలతో కొంత గ్యాప్ వచ్చింది. కొందరు అసమ్మతి నేతలు అద్దంకి వైసీపీ పరిరక్షణ పేరిట కృష్ణచైతన్యకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి.. ఆయనకు వ్యతిరేకంగా తాడిపల్లి వైసీపీ ఆఫీస్ దగ్గర ఆందోళనలు కూడా చేశారు. అయినా ఆయన నియోజకవర్గంలో తన పట్టును పెంచుకోవడంతో పాటు పార్టీని అంతో ఇంతో బలోపేతం చేయగలిగారు. పార్టీ సర్వే ఫలితాలు కూడా బాచిన కృష్ణ చైతన్యకు జైకొట్టాయి. అయితే సామాజిక సమీకరణాలతో అనూహ్య పరిణామాలు జరిగాయి. దీంతో కృష్ణచైతన్య ప్లేస్లో హనిమిరెడ్డి అద్దంకి స్క్రీన్ మీదకొచ్చారు. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గానికి చెందిన గొట్టిపాటి రవికుమార్ కు చెక్ పెట్టడానికి.. రెడ్డి సామాజిక వర్గం నేతను తెరమీదకు తెచ్చారు.
అద్దంకిలో వైసీపీ ప్రత్యార్ధిగా ఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇప్పటికే హ్మాట్రిక్ విజయంతో కొనసాగుతున్నారు. గెలిచిన మూడు సార్లు ఆయన మూడు పార్టీల నుంచి గెలిచారంటే.. వ్యక్తిగతంగా అద్దంకిలో ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు.. 2009లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014లో వైసీపీ తరపున, 2019లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారాయన. మొదటి ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి మీద గొట్టిపాటి విజయం సాధించారు. తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ను వదిలేసి గొట్టిపాటి వైసీపీలో చేరి.. కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్పై గెలిచారు.
రెండో సారి గెలిచినప్పడు ఆయన ఎక్కువకాలం వైసీపీలో ఇమడలేక.. టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పటికీ అద్దంకి టీడీపీ నుంచి గొట్టిపాటి రవి గెలవగలిగారు. ఈ సారి గొట్టిపాటి రవికుమార్ ను ఎలాగానే ఓడించాలనీ వైసిపి అధినేత జగన్ పట్టుదలతో ఉన్నారంట. ఇతర సామాజిక వర్గాలను ఏకం చేసి గొట్టిపాటి రవికి చెక్ పెట్టాలనే.. అద్దంకి వైసిపి ఇన్చార్జిగా హనిమిరెడ్డిని రంగంలోకి దించారంటున్నారు. పాణెం హనిమిరెడ్డి … వైవి సుబ్బారెడ్డి వ్యాపార భాగస్వామి అని తెలుస్తోంది. గొట్టిపాటిని ఢీ కొట్టలంటే ఆర్ధికంగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి హనిమిరెడ్డేనని.. వైసిపి అధిష్టానం భావిస్తోందంట.
వైసిపి అద్దంకి లో వైసిపి జెండా ఎగరవేయాలనీ చూస్తుంటే గ్రౌండ్ లేవల్ పరిస్థితి మాత్రం తేడాగా కనపడుతోంది. అద్దంకి మాజీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే అయిన బాచిన చెంచుగరటయ్య వారసుడైన బాచిన కృష్ణచైతన్య తనను హఠాత్తుగా తొలగించడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయినా ఆశ చావక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అవకాశమిస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తానని హైకమాండ్ను కోరుతున్నారంట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారేదిలేదని.. చివరి నిమిషం వరకు టికెట్ ప్రయత్నాలు చేస్తానని చెప్తూ.. నియోజకవర్గం వ్యాప్తంగా తన అనుచరగణంతో మీటింగులు పెట్టుకుంటున్నారు. చివరి నిముషంలో అయినా వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ఆయన చెప్పుకుంటుండటం విశేషం. దాంతో ఈ గ్రుప్ పాలిటిక్స్ అద్దంకిలో వైసీపీ కొంప ముంచుతాయాని వైసీపీ క్యాడర్ వాపోతుంది. మరి ఈ పరిస్థితిని వైసీపీ పెద్దలు ఎలా సరిదిద్దుతారో చూడాలి.