Krishna Statue : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో అట్టహాసంగా ఆవిష్కరించారు. సినీనటుడు కమలహాసన్ చేతులమీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్తో కలిసి కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు ప్రజలందరి అభిమాన నటుడైన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని దేవినేని అవినాష్ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణగా అభివర్ణించారు. ఆయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవ కార్యక్రమాలలో ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారన్నారు. షూటింగ్లో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావడం సంతోషంగా ఉందన్నారు.
గతేడాది నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తనువుచాలించారు. ఆయన భౌతికంగా లేకపోయినా.. అభిమానులు ఆయన్ను మరిచిపోలేక శిలారూపంలోనైనా ఉండాలని భావించి విగ్రహావిష్కరణలు చేస్తున్నారు. ఇటీవలే కృష్ణ స్వస్థలం అయిన బుర్రిపాలెంలోనూ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కాగా.. లోకనాయకుడిగా పేరుపొందిన కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2, థగ్ లైఫ్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం విజయవాడలోనే జరుగుతోంది.