Ali Clarity On Contesting In 2024 Elections: సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం చాలాకాలం జరుగుతోంది. రాజమండ్రి నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అలాగే గుంటూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ నడిచింది. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడింది. వైసీపీ అధ్యక్షుడు , సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా నేతలతో భేటీ అవుతున్నారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జులను మారుస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఏడు జాబితాలను విడుదల చేశారు.
వైసీపీలో టిక్కెట్లు ఖారారవుతున్న వేళ సినీ నటుడు , ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తన తెలియదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ రావాల్సిఉందన్నారు. సీఎం జగన్ పిలిచి ఫలానా చోటు నుంచి పోటీ చెయ్ అంటే సిద్ధంగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఈ వారంలోనే సీఎంవో నుంచి పిలుపు రావచ్చని సూచనప్రాయంగా తెలిపారు.
ఏ పార్టీ నుంచి పోటీ చేసిన మంచి వ్యక్తులనే ప్రజలు గెలిపిస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలు మారిన వాళ్లు చాలామంది ఉన్నారని కానీ ఎవరు ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఏ పార్టీలు పొత్తులు పెట్టుకున్నా తుద నిర్ణయం ఓటరుదేనని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం మని తాము చెబుతున్నామని.. అలాగే విపక్షాలు సిద్ధం అంటున్నాయని ఏం జరుగుతుందో చూద్దాం అంటూ అలీ చమత్కరించారు.
Read More: పవన్ కల్యాణ్ భీమవరం టూర్ .. అక్కడ నుంచే పోటీకి సన్నద్ధం..!
గత ఎన్నికల్లోనే పోటీ చేయమని తనని కోరారని అలీ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోకుండా ప్రత్యేక్ష ఎన్నికల్లో బరిలోకి దిగితే ఇబ్బందులు వస్తాయనే 2019లో పోటీ చేయలేదన్నారు అప్పటికే అంగీకరించిన సినిమాలకు అన్యాయం జరుగుతుందనే నాడు పోటీకి దిగలేదన్నారు.
అలీ చాలాకాలం క్రితమే వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవీ ఆయనను వరించింది. మరి వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి అలీని వైసీపీ బరిలోకి దింపాలని యోచిస్తోందనే ఆసక్తికరంగా మారింది.