Hathiramji Mutt: తిరుమల హథీరాంజీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్నుతొలగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అర్జున్ దాస్ అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. మహంతుగా వ్యవహరిస్తూ.. కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారన్నారు. సన్యాసిగా జీవించాల్సిన అర్జున్ దాస్ వివాహం చేసుకున్నారని, ఆయనకు పిల్లలు కూడా ఉన్నారని తమ విచారణలో తేలిందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని అన్నారు. ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారన్నారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు.
సస్పెన్షన్ కు గురైన అర్జున్ దాస్ 2006లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచీ ఆయనపై అనేక ఆరోపణలు తరచూ వస్తూనే ఉన్నాయి. మఠానికి సంబంధించిన నగలు గోల్ మాల్ జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018 మార్చిలో లోకాయుక్త కోర్టు హథీరాంజీ మఠం నగల వివరాలను ఆరా తీసింది. దేవదాయ ధర్మాదాయ శాఖకు 16 ప్రశ్నలను సంధించింది. అయితే దేవదాయ శాఖ నుంచిగానీ.. మఠం నిర్వాహకుల నుంచి సరైన సమాధానం రాలేదు.
హథీరాంజీ మఠం ద్వారా శ్రీవారికి మొత్తం 250 రకాల బంగారు ఆభరణాలు, నాణేలు, కిరీటాలు సమర్పించినట్లు లెక్కల్లో ఉంది. వీటన్నింటినీ చంద్రగిరిలోని ఓ బ్యాంక్ లాకర్లో భద్రపరిచారు. అయితే ప్రస్తుతం సస్పెన్షన్కు గురైన అర్జున్దాస్ వద్దే బ్యాంక్ లాకర్ తాళాలు ఉంచుకున్నారు. కానుకల రూపంలో కోట్లు విలువచేసే ఆభరణాలు ఎక్కడ ఉంచారనే లెక్కలు అర్జున్ దాస్కు తప్ప మఠం నిర్వాహకుల వద్ద లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాకర్లోని వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు అమ్మి పుణేలో అర్జున్దాస్ బంధువుల పేరున రెండు వందల ఎకరాలను కొనుగోలు చేసినట్లు మఠంలోని వారు చెబుతున్నారు.