Reactor Blast Achyuthapuram Pharma Comapny: ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. అనకాపల్లిలోని అచ్చుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. తర్వాత మృతుల సంఖ్య 16కు చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. ఇంకా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అగ్రిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పేలుడు సమయంలో విధుల్లో సుమారు 300 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి అంతస్తులో పై కప్పు కూలడంతో కొంతమంది చిక్కుకున్నట్లు తోటి కార్మికులు తెలిపారు. అయితే పేలుడు ధాటికి కార్మికుల శరీర భాగాలు ఛిద్రమైనట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. దీంతో కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. గాయపడిన వారిలో కొంతమంది 60 శాతానికి పైగా కాలిన గాయలతో ఉన్నట్లు తెలుస్తోంది.
అచ్యుతాపురం సెజ్ రియాక్టర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ప్రమాదంపై ఆ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఘటనపై హోం మంత్రి అనిత కూడా స్పందించారు. ఫార్మా కంపెనీపై ఆరా తీశారు.
Also Read: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం
అలాగే, రియాక్టర్ పేలుడు ఘటన దురదృష్టకరమని కార్మిక శాఖ మంత్రి సుభాస్ అన్నారు. భారీగా పొగ రావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని తెలిపారు. మృతుల వివరాలు తెలిసేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. కాగా, ఈ ఘటనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతులు వీళ్లే..
వి. సన్యాసినాయుడు(ప్లాంట్ ఏజీఎం), రామిరెడ్డి(ల్యాబ్ హెడ్), హారిక(కెమిస్ట్), పార్థసారథి(ప్రొడక్షన్ ఆపరేటర్), వై.చిన్నారావు(ప్లాంట్ హెల్పర్), పి.రాజశేఖర్(22), మోహన్(ఆపరేటర్), హెచ్.ప్రశాంత్, ఎం.నారాయణరావులుగా గుర్తించారు. మరో ఆరుమంది వివరాలు తెలియాల్సి ఉంది.