Chandrababu House:
ఉండవల్లి కరకట్ట ఇల్లు జప్తుపై ఏసీబీ కోర్టు తీర్పు
లింగమనేని రమేశ్ ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వలేం: ఏసీబీ కోర్టు
సీఐడీ వేసిన పిటిషన్పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న కోర్టు
ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలన్న కోర్టు
సీఐడీ అధికారులు కోర్టు ముందుకు రావాలన్న ఏసీబీ కోర్టు
తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు అద్దె నివాసం వ్యవహారంపై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును ప్రకటించింది. ఇటీవల చంద్రబాబు ఉంటున్న ఇంటిని జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. లింగమనేని ఎస్టేట్స్ కోర్టును ఆశ్రయించింది.
రాజధాని నగర బృహత్ ప్రణాళిక డిజైనింగ్ ద్వారా లింగమనేని ఆస్తులు, భూముల విలువ పెరగడానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సహకరించారని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రతిగానే క్విడ్ ప్రో కో కింద లింగమనేని రమేష్ తన ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా ఉచ్చారని సీఐడీ వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. తీర్పును రిజర్వు చేయగా.. తాజాగా జడ్జిమెంట్ వెల్లడించింది.
లింగమనేని రమేశ్ ఇంటిని జప్తుపై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్మెంట్కు అనుమతించాలంటే.. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనేది విచారించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకు, సీఐడీ తరఫు అధికారిని సైతం విచారించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. లింగమనేని రమేష్కు కేసుకు సంబంధించిన దస్త్రాలు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది ఏసీబీ కోర్టు. తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా వేసింది.