ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్ వాసా నగేష్ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్ అపార్టుమెంట్లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.
ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ లో నగేష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.
విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని నగేష్ నివాసంలో రూ.17.91 లక్షల నగదు, 209 గ్రాముల బంగారం లభ్యమయ్యాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో మూడు గృహాలు, ఒక ప్లాటుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ద్వారకాతిరుమల యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఒక లాకరును ఇంకా తెరవాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లు ధ్రువీకరించుకోవాల్సి ఉన్నందున సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు.
నగేష్ గతంలో ద్వారకా తిరుమలలో పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్జేసీ స్థాయి అధికారి ఈ వ్యవహారంపై విచారణ చేశారు. ఈ కేసులో నగేష్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. గతంలో శాఖాపరమైన విచారణ చేసిన ఆర్జేసీ భ్రమరాంబ ప్రస్తుతం దుర్గగుడి ఈవోగా ఉన్నారు.