Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తుండటంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లన్నింటికీ సెలవు ప్రకటించారు అధికారు. లోతట్టు ప్రాంతాలతో పాటు.. ప్రధాన రహదారులు సైతం జలమయమయ్యాయి.
విజయవాడలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. సింగ్ నగర్, ఏలూరు రోడ్, బందరు రోడ్ జలమయమయ్యాయి. మొగల్రాజపురంలో భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడి ఓ ఇంటిపై పడగా.. నలుగురు మృతిచెందారు. వారిలో ఒకరిని 25 సంవత్సరాల మేఘనగా గుర్తించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక విజయవాడలోకి వచ్చే వాహనాలకు దారి మళ్లించాలని ట్రాఫిక్ పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వీవీఐపీలు రోడ్లపైకి రావొద్దని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ద్విచక్రవాహనదారులు సైతం కొన్ని గంటల పాటు రోడ్డుపైకి రావొద్దని అధికారులు తెలిపారు. జాతీయ రహదారుల నుంచి సర్వీస్ రోడ్లలోకి వాహనాలను మళ్లించారు. విజయవాడలోని ప్రధాన కూడళ్లలో నిలిచిపోయిన నీటిని ఫైరింజన్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. నిడమానూరు నుంచి టంకసాల వరకూ జాతీయ రహదారి పూర్తిగా నీటమునిగింది.
Also Read: ఆకాశం ముసురేసింది.. ఊరంతా ముసిగేసింది.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. ఏపీలో మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. అలానే కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన రద్దు అయినట్టు అధికారులు తెలిపారు.
తెలంగాణలోనూ రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. మూడు జిల్లాల్లోనూ 20 సెం.మీ.లకు పైగా వర్షం పడే అవకాశం ఉందని.. పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ.. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు అంటున్నారు. హైదరాబాద్లోనూ రాగల 36 గంటల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
పల్నాడు జిల్లా అచ్చంపేట ప్రధాన రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నెరు ప్రవహిస్తోంది. దీంతో అచ్చంపేట-మాదిపాడుకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు, విద్యార్థులు ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు మాదిపాడు నుండి అచ్చంపేట వస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ కోరారు. ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ అలెర్ట్ మెసేజ్లు గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కొండ చరియలు విరిగిపడే, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు.