TDP : గుంటూరు తొక్కిసలాట దుర్ఘటనపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తప్పు ప్రభుత్వానిదే అని టీడీపీ ఆరోపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభలకు భద్రత సరిగ్గా కల్పించడంలేదని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రచార యావే సామాన్యుల ప్రాణాలను బలితీసుకుంటోందని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. 0
దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దుర్ఘటన జరిగిన వెంటనే వైసీపీ సోషల్ మీడియాలో బ్లేమ్గేమ్కు తెరలేపిందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కార్యక్రమాలకు తగిన పోలీసు బందోబస్తు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా?’ అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కమిటీ ఆరోపించింది.
ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.. గాయపడిన మహిళలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలోనే ప్రచారం కోసం కానుకల పంపిణీ చేపట్టారని మండిపడ్డారు. పేద మహిళలంటే చంద్రబాబుకు చులకనని విమర్శించారు. కందుకూరు సభ తర్వాత కూడా చంద్రబాబుకు పశ్చాత్తాపం కలగలేదన్నారు. ఈ ఘటనపై ఉయ్యూరు ఫౌండేషన్, చంద్రబాబు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ కారణంగా ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయన్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకు ఉన్న విలువ కందుకూరులో 8మందికి, గుంటూరు ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో అని మాజీ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు. చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న అని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
మరోవైపు ఉయ్యూరు ఫౌండేషన్ చేపట్టిన కానుకల పంపిణీలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం తీవ్ర విచారకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. పేదలకు స్వచ్ఛంద సంస్థ చేసే సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆలోచనతో వెళ్లానని ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సాయం అందజేస్తానని, క్షతగాత్రులకు వైద్య ఖర్చులను భరిస్తానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఉయ్యూరు ఫౌండేషన్ ప్రకటించింది. క్షతగాత్రుల చికిత్స ఖర్చు భరిస్తామని చెప్పింది. ఒక్కొక్క కుటుంబానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ. రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
తొక్కిసలాట దుర్ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే ముస్తఫా పరామర్శించారు.