విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్మికులు పోర్టు బంద్ కు పిలుపునివ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కార్మికులు ఒక్కసారిగా పోర్టు వైపు దూసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కార్మికులకు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలామందికి గాయాలయ్యాయి.
తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పోర్టు కార్మికుల ఆందోళన చేపట్టారు. కనీస నెల వేతనం రూ.36 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు, నిర్వాసితులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలు, అఖిలపక్ష నాయకులు పోర్టు వద్దకు చేరుకోవడంతో టెన్షన్ వాతావారణం ఏర్పడింది.
కార్మికుల బంద్ పిలుపు నేపథ్యంలో గంగవరం పోర్టు వద్ద ముందస్తుగానే పోలీసులు భారీగా మోహరించారు. పోర్టు ప్రధాన ద్వారానికి 100 మీటర్ల దూరంలో కార్మికులను అడ్డుకున్నారు. అదనపు గేటుకు ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేసి నిరసనకారులను నిలువరించేందుకు యత్నించారు.
భారీగా తరలివచ్చిన పోర్టు కార్మికులు కంచెను దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొంతమంది కార్మికులు గాయపడ్డారు. 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాక సీఐ కూడా గాయపడ్డారు. ఆయన కాలిలోకి ముళ్ల కంచె దిగింది.