IRR Case : అమరావతి ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే కేసులో ఇతర నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబు కూడా వర్తిస్తాయని తేల్చిచెప్పింది.
2022లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. అందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విభిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు, ఈ కేసుకూ సంబంధం ఉందా? అని ప్రశ్నించింది. ఇంకా పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసులో నమోదయ్యాయని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతోందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలు కూడా తీసుకుంది.