A.P.government facing funds problem..August 1st employees salaries and pensions :ఏపీలో టీడీపీ కూటమి అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వై నాట్ వన్ సెవంటీ ఫైవ్ ప్రభుత్వాన్ని 11 సీట్లకే పరిమితం చేసి..ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. తెలుగు తమ్ముళ్లు అంబరాన్నంటిన సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో పండుగలా టీడీపీ కూటమి గెలుపు ను ఆస్వాదించారు. టీడీపీ నేత చంద్రబాబు ఫుల్ హ్యాపీ. కట్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ సమస్యల తోరణంతో స్వాగతం పలికింది. ఒక పక్క రాజధాని లేదు..పోలవరం పూర్తి కాలేదు. మరో పక్క ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గం మూసుకుపోయింది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికే ఈ ఐదేళ్లు సరిపోయేలా ఉంది.
వెంటాడుతున్న అప్పులు
ఖర్చులు నియంత్రించుకుంటూనే ఆదాయం పెంచుకుంటూ పోవాలి. అలాగని వచ్చీ రాగానే ట్యాక్సులు, కరెంట్ ఛార్జీలు పెంచితే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. వైసీపీ పాలనలో దాదాపు 9.74 లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయాయి. దాదాపు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టులోనే ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి అసలైన టాస్క్ ఆరంభమవబోతోంది. అది కూడా ఆగస్టు 1 రూపంలో. మొన్నటి ఎన్నికలలో చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలుచేస్తామని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అందులో భాగంగా నెలనెలా పెన్షన్లు సమయానికి అందించాలి. వైసీపీ పాలనలో మూడు వేల పెన్షన్ కాస్తా నాలుగువేలకు పెంచుతామని వాగ్దానం చేశారు చంద్రబాబు అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంనుంచి ఇస్తామన్నారు. ఆ లెక్కన చూసుకుంటే ఏప్రిల్ నుంచి నెలకు వెయ్యి చొప్పున మొత్తం మూడు నెలలకు మూడు వేలు కలిపి ఆగస్టు పెన్షన్ తో కలిపి దాదాపు రూ.7 వేల పెన్షన్ అందించాల్సి ఉంటుంది. పైగా ఇదే నెలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా అందజేస్తామని అన్నారు. అలాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆగస్టు నుంచే అమలు చేయాల్సి ఉంటుంది.
నిధులు సమకూరేదెలా?
ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు వెయ్యవలసి ఉంటుంది. జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను అలక్ష్యం చేసినందునే మొన్నటి ఎన్నికలలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఉద్యోగుల జీతాలే పెద్ద సమస్య అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్ అయినవారికి ఇవ్వాల్సిన గ్రాడ్యుటీ, పెన్షన్ పెద్ద సమస్యగా మారింది. ఇవేగాకుండా దివ్యాంగులకు, వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు రూ.కోట్లలో నిధులు సమకూర్చుకోవాల్సి వస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులు సమీకరించుకోవడాకిని సమయం పడుతుంది. ఈ ఆగస్టు గండం గడిచేదెలా అని నేతలు తలలు పట్టుకుంటున్నారు. వచ్చీ రాగానే జీతాలు లేట్ చేస్తే ప్రతిపక్ష హోదాలో జగన్ మామూలుగా రభస చేయడు. టీడీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ప్రభుత్వ నిరర్ణక భూములు ఉన్నాయో ఇంకా లెక్క తేలలేదు. కనీసం వాటిని అమ్మైనా నిధులు సమకూర్చుకోవచ్చు. ఆ అవకాశం కూడా లేదు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో కనీసం నాలుగయిదు వేల కోట్లు సమీకరించుకోగలిగితే ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడొచ్చు అని సలహాలు ఇస్తున్నారు.
బాబు అంటేనే.. భరోసా
గతంలో తెలుగు దేశం పార్టీలో ఆగస్టు నెలలో తీవ్రమైన ఆటంకాలు వచ్చిపడ్డాయి. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆగస్టు నెలలోనే ఏదో ఒక అనర్థం జరుగుతోంది. ఇది ఆగస్టు సంక్షోభం అని కొందరు అంటుంటే..ఇదేదో పెద్ద సమస్య కాదు..బాబు తలుచుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు తమ సర్కార్ కు పెద్ద సమస్యే కాదంటున్నాయి పార్టీ శ్రేణులు. బాబు అంటేనే భరోసా అని తెలుగు తమ్ముళ్లు సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఎలాంటి సమస్యనైనా ఆయనకున్న అపార రాజకీయ అనుభవంతో ఇట్టే పరిష్కరిస్తారని అనుకుంటున్నారు ఏపీ ప్రజలు.