ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని సెక్రటేరియట్, పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి అమాయకుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది. అశ్వాపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి రాకపోకలు చేస్తుండేవాడు.
అయితే ఈ వ్యక్తి అశ్వాపురంలో ఉంటూ మణుగూరు, పినపాక, పలు ప్రాంతాల యువకులకు, పెద్దలకు దగ్గరయ్యాడు. ఆంధ్రప్రదేశ్లోని సెక్రటేరియట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షల రూపాయలు తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే సర్టిఫికెట్స్ కూడా తీసుకున్నాడని అవేదం వ్యక్తం చేశారు.
బాధితులు ఉద్యోగం గురించి ఎప్పుడు అడిగిన ఇదిగో మీదే ఆర్డర్ కాపీ రెడీ అవుతుంది అంటూ నమ్మిస్తున్నాడని తెలిపారు. ఉద్యోగం రాకపోతే రాకపోయింది.. కనీసం సర్టిఫికెట్స్ అయినా ఇవ్వమని వేడుకుంటే రేపిస్తా.. మాపిస్తా అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాడని బాధితులు వాపోయారు. ఎన్ని రోజులు గడిచినా ఉద్యోగ ఆర్డర్ కాపీ లేదు.. ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే..” ఇదిగో నేను కాకినాడ, నెల్లూరు, అమలాపురం, రాజమండ్రిలో మీ పని మీదనే ఉన్నాను ” అని సమాధానం చెబుతుండే వాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏదైనా అంటే ఎందుకు ఊరికే మెసేజ్, కాల్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని బాధితులు తెలిపారు. బాధితులు ఉద్యోగం కోసం ఆ వ్యక్తికి డబ్బులు కొందరు బై హ్యాండ్ క్యాష్ ఇచ్చారుని తెలిపారు. మరికొందరు ఫోన్ పే, గూగుల్ పే చేశారని కూడా తెలుస్తోంది.