టీడీపీ అధినేత చంద్రబాబు పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన సమయంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు గ్రామంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనపై కురబలకోట మండలం ముదివీడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. చంద్రబాబుతోపాటు 20 మందిని నిందితులుగా పేర్కొన్నారు.
ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్నాథ్ రెడ్డి, ఏ4గా రాంగోపాల్రెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు. అలాగే నల్లారి కిశోర్ కుమార్రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, పులవర్తి నాని, గంటా నరహరి, శ్రీరాం చినబాబుపై కేసులు పెట్టారు. మొత్తం 20 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశామని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు.
ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సమయంలో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చేపట్టారు. గత శుక్రవారం అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలంలోని గాలేరు-నగరి, హంద్రీ-నీవా అనుసంధానం పనులు, బి.కొత్తకోట మండలంలో హంద్రీ-నీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. ఆ తర్వాత కురబలకోట మండలం అంగళ్లు గ్రామం మీదుగా చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అయితే ఆ సమయంలో అంగళ్ల గ్రామంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి.
అంగళ్లు గ్రామ సమీపంలోకి రాగానే చంద్రబాబు బుల్లెట్ప్రూఫ్ వాహనం నుంచి దిగారు. ఓపెన్ టాప్ వాహనంపైకి ఎక్కి గ్రామ కూడలి వరకు వెళ్లారు. అక్కడికి చంద్రబాబు వచ్చినప్పుడు వైసీపీ శ్రేణులు అటుగా వెళ్లకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో పలువురు గాయపడ్డారు. చంద్రబాబు అంగళ్లు గ్రామం నుంచి వెళ్లిపోయిన తర్వాత విధ్వంసకాండ కొనసాగింది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అంగళ్లు ఘటనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆ గ్రామంలో చంపాలని చూశారని ఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న చంద్రబాబు.. అంగళ్లు అల్లర్లపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనపై హత్యాయత్నానికి పోలీసులు సహకరించారని ఆరోపించారు.