Visakhapatnam : ఆ బాలిక పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా జరుపుకుంది. తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉత్సాహంగా గడిపింది. ఆ వేడుక జరిగిన కొన్ని గంటలకే ఆ అమ్మాయికి నూరేళ్లు నిండిపోయాయి. సోదురుడు కూడా ఆమెతోపాటు ప్రాణాలు కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలవిసెలా రోదిస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్ధరాత్రి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఆ సమయంలో భవనంలో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులకు కుడుపుకోతను మిగిల్చింది.
విశాఖకు చెందిన సాకేటి రామారావు, కల్యాణి దంపతులకు దుర్గాప్రసాద్ (17), అంజలి (14) సంతానం. బుధవారం కుటుంబ సభ్యులందరూ కలిసి అంజలి పుట్టినరోజును వేడుకగా చేసుకున్నారు. ఆ వేడుక జరిగిన కొన్ని గంటల కూడా కాకముందే దుర్గాప్రసాద్, అంజలి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కంటికిరెప్పలా పెంచుకుంటున్న ఇద్దరు పిల్లలు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో గాయపడిన తల్లిదండ్రులు రామారావు, కల్యాణి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
భవనం కుప్పకూలిన సమాచారం అందగానే పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, రెవెన్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయ చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సిబ్బంది గురువారం ఉదయం బిహార్కు చెందిన చోటు (27) మృతదేహాన్ని వెలికితీశాయి. గాయపడిన కొమ్మిశెట్టి శివశంకర, సున్నపు కృష్ణ, సాతిక రోజారాణి, రామారావు, కల్యాణిని కేజీహెచ్ కు తరలించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ సుమిత్ గరుడ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.