శ్రీశైలంలో చేపట్టిన ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్ అయ్యింది. భల్లూకాన్ని శుక్రవారం వేకువజూమున అటవీశాఖ అధికారులు బంధించారు. శిఖరేశ్వరం సమీపంలో రెండురోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎలుగుబంటి దాడి చేస్తుందోమోనని బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు.
ఎలుగుబంటి బంధించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శిఖరేశ్వరం పరిధిలో 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎలుగుబంటి బోనులో చిక్కింది. దానిని వెలుగోడుకు ఫారెస్ట్ అధికారులు తరలించారు.
శ్రీశైలం పరిధిలో చిరుత కూడా సంచరిస్తోంది. దీంతో అధికారులను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ అలాంగ్ చాంగ్ తెరాన్ అప్రమత్తం చేశారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇటీవల తిరుపతిలో చిరుత పులి దాడిలో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తిరుపతి ఘటన తర్వాత శ్రీశైలంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు బోన్లు అమర్చి ఎలుగుబంటిని పట్టుకున్నారు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.