8th Class Student Suspiciously Dead in Guntur District: నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక ఉదంతం తర్వాత.. అలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించినా.. కీచకుల ఆలోచనల్లో మార్పు లేదు. తాజాగా గుంటూరుజిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థిని శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మరణించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం శైలజ, ఆమె అన్నయ్య కలిసి స్కూల్ కి వెళ్లారు. స్కూల్ అయిపోగానే బాలుడు ఒక్కడే ఇంటికి చేరుకున్నాడు. చెల్లి ఎక్కడని తల్లి ప్రశ్నించడంతో.. వెంటనే స్కూల్ కు వెళ్లి శైలజ గురించి టీచర్లను అడిగాడు. మధ్యాహ్నమే ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వెళ్లిపోయినట్లు చెప్పారు. కానీ శైలజ ఇంటికి చేరుకోలేదు.
తల్లీ, కొడుకు కలిసి శైలజ ఆచూకి కోసం చుట్టుపక్కల అంతా వెతికారు. గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటివద్ద శైలజ చెప్పుల్ని గుర్తించిన అన్న.. కిటికీలో నుంచి చూడగా.. మంచంపై విగతజీవిగా కనిపించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు తాళం పగలగొట్టి.. బాలికను ఆ ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
Also Read: అత్యాచార నిందితుల్ని వదలం.. బాధితుల కుటుంబాలకు పరిహారం : హోంమంత్రి అనిత
పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడికి చేరుకుని శైలజను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దాంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. శైలజ మెడపై గాయాలుండటంతో హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. శైలజ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా పంపిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా.. గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజుకు పెళ్లైంది. కానీ.. మూడేళ్లుగా అతను ఒంటరిగానే ఉంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. శైలజ మృతితో.. నాగరాజు పరారయ్యాడు. అతడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నాగరాజు కోసం గాలిస్తున్నారు.