CM Jagan to Release YSR Cheyutha Funds Today(ap political news) : చేతివృత్తులు, చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని.. తమ కాళ్లమీద తాము బ్రతికేలా మహిళలకు చేయూతను అందిస్తోన్న పథకం వైఎస్సార్ చేయూత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవనోపాధుల నిమిత్తం.. 26 లక్షల 98 వేల 931 మంది మహిళల ఖాతాల్లో.. ఒక్కొక్కరికీ రూ.18,750 చొప్పున నేడు నాలుగవ విడత ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీ వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్యనున్న మహిళల ఖాతాల్లోకి ఈ నిధులు జమ కానున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాల మహిళలు శాశ్వత జీవనోపాధిని పొందేలా .. 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 3 విడతలుగా ఒక్కో విడతలో రూ.18,750 చొప్పున ప్రతి అర్హురాలైన మహిళకు రూ.56,250 చొప్పున నిధులు అందించింది. నాల్గవ విడత నిధులతో మొత్తం రూ.75 వేల సాయం అందుతుంది. ఈ ఒక్క పథకం ద్వారానే వైసీపీ ప్రభుత్వం రూ.19,189.60 కోట్లను మహిళలకు అందించినట్లు అవుతుంది.
Read More : నేడు ఢిల్లీకి చంద్రబాబు.. పొత్తుల లెక్కలు తేలుతాయా ?
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడలో బటన్ నొక్కి నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేస్తారు. నేటి నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మండలాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వైఎస్సార్ చేయూత నిధుల పంపిణీ జరుగుతుంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన మహిళల్లో 16 లక్షల 55 వేల 591 మంది మహిళలు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.
నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు చేరుకుంటారు. అక్కడి నుంచి పిసినికాడ వెళ్లి.. నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులను బటన్ నొక్కి విడుదల చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.