Pattabhi: గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయం ధ్వంసం అయింది. కారు తగలబడింది. వీటికి బోనస్గా అన్నట్టు.. టీడీపీ నేతలపైనే కేసులు నమోదయ్యాయి. పట్టాభితో సహా 14 మందికి 14 రోజుల రిమాండ్ కూడా పడింది. ఇలా గన్నవరం ఎపిసోడ్ ఏపీ మార్క్ పాలిటిక్స్కు మరో ఎగ్జాంపుల్గా నిలిచింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్తో పాటు దొంతు చిన్నా, గురుమూర్తి సహా పోలీసులు అరెస్టు చేసిన 14 మంది తెలుగుదేశం నేతలకు గన్నవరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పట్టాభిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా.. మిగతా నిందితులను జైలుకు షిఫ్ట్ చేశారు.
గన్నవరం సీఐ కనకారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్ల.. పట్టాభి సహా మిగిలిన టీడీపీ నేతలు తనకు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని కంప్లైంట్ చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు.. ఏ-1గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కోర్టులో విచారణ సందర్భంగా పట్టాభి.. పోలీసులపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని అన్నారు. ముగ్గురు వ్యక్తులు ముసుగులో వచ్చి తనను అరగంట సేపు కొట్టారని చెప్పారు. పట్టాభి స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు.. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని న్యాయమూర్తి ఆదేశించారు.