T20 Cricket : ఆసిస్ తో జరిగిన టీ 20 సిరీస్ లో టీమ్ ఇండియాలో కొందరు అదృష్టవంతులు ఉన్నారు. వారిలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అని చెప్పాలి.
ముందుగా రుతురాజ్ గైక్వాడ్ అయితే రికార్డుల మీద రికార్డులు తిరగ రాశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన దైపాక్షిక సిరీస్ లో ఓపెనర్ గా వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డ్ నెలకొల్పాడు. 5 మ్యాచ్ల్లో 55.75 యావరేజ్తో 223 పరుగులు చేశాడు.
అంతకుముందు 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 218 పరుగులు చేశాడు. ఇప్పుడు రుతురాజ్ అతన్ని అధిగమించాడు.
వైజాగ్ టీ20లో డైమండ్ డక్ అయిన తర్వాత పుంజుకుని రెండో టీ 20లో 58, మూడో టీ20లో 123 నాటౌట్, నాలుగో టీ20లో 32 పరుగులతో సత్తా చాటాడు. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగిన చివరి టీ20లో 10 పరుగులకే వెనుదిరిగినా రికార్డ్ అయితే అందుకోగలిగాడు.
అర్షదీప్ సింగ్ కి కూడా బెంగళూరులో జరిగిన ఐదో టీ 20 మ్యాచ్ గుర్తుండిపోతుంది. తనకే కాదు క్రికెట్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చివరి ఓవర్లో అతను 10 పరుగులు డిఫెండ్ చేయడంతో పాటు మాథ్యూ వేడ్ వంటి కీలక బ్యాటర్ను ఔట్ చేశాడు. భారత్ కి చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
ఆస్ట్రేలియా సిరీస్ లో టీమ్ ఇండియాకి దొరికిన ఒక ఆణిముత్యం రింకూ సింగ్ అని చెప్పాలి. ఇంతకాలం ఎక్కడున్నావు రింకూ…అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ 2023లో సూర్యకుమార్ బదులు రింకూ సింగ్ ని తీసుకుంటే ఎంత బాగుండేదని కూడా అంటున్నారు.
ఇక్కడందరికీ సర్ ప్రైజ్ ఏమిటంటే రింకూ సింగ్…ఇండియన్ స్టార్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు కావడమే… సురేష్ రైనా తీసుకెళ్లి ధోనికి పరిచయం చేశాడు. రైనా వారసుడిగా చెన్నైసూపర్ కింగ్స్ లో చేరి మంచి ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు ఈ సిరీస్ లో ఇరగదీసి వదిలేశాడు. క్రికెట్ ప్రపంచానికి భారత ఆశాకిరణంగా పరిచయమయ్యాడు. అతను ఆడాడా? లేడా? కాదు, ముందు అతనిలో డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఇదే ధోని నేర్చించే మొదటి సూత్రమని కూడా చెబుతున్నారు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్…ఇంతకాలం తన 360 డిగ్రీల్లో ఆడగల బ్యాటర్ గానే కాదు, ఆకాశమే హద్దుగా చెలరేగే స్కై గానే కాదు…ఇప్పుడు సూపర్ కెప్టెన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆఖరి రెండు మ్యాచ్ లు నిజానికి లో స్కోర్ గేమ్ లనే చెప్పాలి. వాటిని గెలిపించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. మరి తనలోని కెప్టెన్సీ ఒత్తిడి ఆటపై పడకుండా చూసుకోవాలని సీనియర్లు సలహాలిస్తున్నారు.
ఇంకా రివి బిష్ణోయ్ 9 వికెట్లు తీసుకుని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మొదటి 5 ఓవర్లలో కీలకమైన వికెట్లు తీసి ఇండియా సిరీస్ అందించడంలో తన పాత్ర చాలా విలువైనది, కీలకమైనదని చెప్పాలి. అందుకనే బిష్ణోయ్ కి అవార్డు దక్కింది. ఒక బౌలర్ కి ఈ అవార్డు రావడం గొప్ప విషయమని, చాలా అరుదుగా జరుగుతుంటుందని సీనియర్లు వ్యాఖ్యానించారు. అంటే తను జట్టులో ఎంత విలువైన ఆటగాడనేది అర్థమవుతుందని అంటున్నారు.