Dengue Deaths : ఈ ఏడాది డెంగ్యూ మరణాలు అత్యధికంగా చోటుచేసుకున్న టాప్ 20 దేశాల్లో ఇండియా కూడా ఉంది. జనవరి-నవంబర్ నెలల మధ్య 20 దేశాల్లో 50 లక్షల కేసులు వెలుగుచూశాయని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ నివేదించింది.
2022లో కేసులతో పోలిస్తే ఇది 30% అధికం. 2019 లెక్కల ప్రకారం చూసినా 18% ఎక్కువే. భారత్ సహా డెంగ్యూ జ్వరాలు అధికంగా ఉన్నటాప్ 20 దేశాల్లో 5500 మంది మరణించారు. 2019 నాటి మరణాలతో పోలిస్తే ఇది 11%, 2022 లెక్కలతో పోలిస్తే 32% అధికమని ఆ నివేదిక తేల్చింది.
వాస్తవ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లోనే డెంగ్యూ మరణాలు ఈ ఏడాది ఎక్కువ. ఇప్పటివరకు 3 లక్షల మంది దీని బారిన పడ్డారు. నిరుడు డెంగ్యూ కేసులు 62 వేలు మాత్రమే.
బంగ్లాదేశ్లో ఈ ఏడాది ఇంతగా విజృంభించిన డెంగ్యూ 1598 మందిని బలితీసుకుంది. వీరిలో 160 మంది చిన్నారులు ఉన్నారు. 2022తో పోలిస్తే మృతుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. ఆసియా దేశాల్లో వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల డెంగ్యూ కేసులు ప్రబలాయి.
ముఖ్యంగా చిన్నారులపై డెంగ్యూ జ్వరాల ప్రభావం ఎక్కువగా పడింది. డెంగ్యూ కేసులు ప్రబలడానికి ఎల్ నినో కూడా కారణమేనని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ ముప్పు 8 రెట్లు పెరిగింది. 2000 సంవత్సరంలో 5 లక్షల కేసులు నమోదు కాగా.. 2022 నాటికి ఆ సంఖ్య 42 లక్షలకు పెరిగింది.