IND vs AUS : బౌలర్ 140 కిలోమీటర్ల వేగంతో వేసే బాల్స్ ని, గ్రౌండ్ లో అంపైర్లు నిశితంగా గమనిస్తూ ఉండాలి. క్షణంలో వెయ్యో వంతులో వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలి. మరో వైపు నోబాల్స్, వైడ్స్, ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూలు, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వేసే బాల్స్ నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్లగానే అవుట్ అని గట్టిగా అరుస్తుంటారు. అవి కూడా చూసుకుంటూ ఉండాలి. వీటితో పాటు రన్ అవుట్లు చూడాలి.
ఇన్ని చేస్తూ గ్రౌండ్ లో ఓవర్లు ఎన్ని అయ్యాయి? బాల్స్ ఎన్నయ్యాయి? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ లెక్కలు ఏకకాలంలో రాసుకోవాలి. ఇవి చేస్తూనే సామాన్యుడికి తెలీని టైమ్డ్ అవుట్ లాంటి క్రికెట్ నిబంధనలను గమనిస్తూ ఉండాలి.
ఇదంతా ఎందుకంటే, అంపైర్లు వీటన్నింటిని చూస్తూనే బ్యాటర్లు కొట్టే బాల్స్ తమవైపునకు రాకుండా చూసుకోవాలి. ఒకొక్కసారి జంప్ లు చేసి తప్పించుకోవాలి కూడా…లేదంటే బాక్స్ లు బద్దలైపోయే ప్రమాదం ఉంది. అలాంటి సన్నివేశమే ఒకటి ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరిగిన టీ 20 ఆఖరి మ్యాచ్ లో జరిగింది.
ఈ మ్యాచ్ లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆఖరి ఓవర్ అర్షదీప్ వేస్తున్నాడు. మొదటి బాల్ వేశాడు. అది బ్యాటర్ తల మీద నుంచి వెళ్లిందని ఆసిస్ కెప్టెన్ మాథ్యూ వెడ్ లెగ్ అంపైర్ కి చెప్పాడు. తను కాదన్నాడు. అప్పుడు వేడ్ గ్రౌండ్ లో అసహనంగా కాసేపు గంతులేశాడు. ఒకవేళ ఇస్తే… నో బాల్ ఒకటి వచ్చేది. మూడో వన్డేలో కొట్టినట్టు ఒక సిక్సర్ కొట్టేదామనుకున్నాడు. కుదరలేదు.
అర్షదీప్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అదే ఓవర్ లో కెప్టెన్ వేడ్ అవుట్ అయ్యాడు. చివరికి రెండు బంతుల్లో 9 పరుగులు పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ దశలో ఐదో బంతిని నాథన్ ఎల్లిస్ స్ట్రైట్గా ఆడాడు.
బంతిని అర్ష్దీప్ ఆపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. కానీ బంతి వెళ్లెళ్లి వికెట్ల వెనుకనే ఉన్న ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మకు బలంగా తగిలింది. ఆయన క్షణంలో వెయ్యోవంతులో ప్రమాదాన్ని గమనించాడు. వెంటనే ఛక్ మని పక్కకు తిరిగాడు. ఈయన తిరిగినట్టు బాల్ తిరగదు కదా.. అది వెళ్లి ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేసే తొడ దగ్గర తాకింది. కామెంటేటర్లు సైతం ఓహో.. జస్ట్ మిస్ అంటూ గట్టిగా అరిచారు. వీరేందర్ శర్మ ఎప్పటిలా శిలా విగ్రహంలా నిలబడిపోయి ఉంటే…బాక్స్ బద్దలైపోయేదని అంటున్నారు.
ఈ క్రమంలోనే అంపైర్ పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆగ్రహంగా రియాక్షన్ ఇచ్చాడు. అప్పటికే ఇదే ఓవర్ లో ఫస్ట్ బాల్ ని, నో బాల్ ఇవ్వకపోవడంతో మండిపోయి ఉన్న వేడ్ ఆగ్రహాన్ని ఆపుకోలేక పోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఒకవేళ అంపైర్ కి తగిలి ఉండకపోతే, అది ఫోర్ వెళ్లేది..ఆఖరి బాల్ కి సిక్స్ కొడితే పనైపోయేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియా విజయానికి అంపైర్ కూడా కలిసొచ్చాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.