Stock Market: ఆదివారం వెల్లడైన మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో పయనిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలవడంతో.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్న అంచనాలు సూచీలను లాభాలవైపు తిప్పాయి. సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.
సోమవారం ఉదయమే లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అదే జోరును కొనసాగించాయి. ప్రధాన సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ 1 శాతానికి పైగా లాభాలను అందుకుని సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. ఎన్నికల ఫలితాలు, భారీగా జీఎస్టీ వసూళ్లు, సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బలమైన జీడీపీ వృద్ధిరేటు, నవంబర్ లో గణనీయంగా జరిగిన వాహనాల విక్రయాలు వంటి అంశాలు లాభాల బాట పట్టించాయి.
సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లకు పైగా పెరిగి 68,634 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేయగా.. నిఫ్టీ 20,619.70 వద్ద రికార్డు స్థాయికి చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని వివిధ సంస్థ మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.343 లక్షల కోట్లకు చేరింది. గడిచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో వీటి విలువ రూ.14 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం.