Leader Of Opposition : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్, కవిత సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ కాకుండా.. కేటీఆర్, కవిత భేటీ కావడంపై గులాబీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఫలితాల తర్వాత కేసీఆర్ ఎవరికీ కనిపించలేదు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా? అని కూడా గులాబీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
ఒకవేళ కేసీఆర్ విపక్షనేతగా బాధ్యతలు తీసుకోకపోతే.. ఆ స్థానాన్ని పార్టీ నేతల్లో ఎవరికి అప్పగిస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీశ్ రావుల్లో ఎవరికో ఒకరికి విపక్ష నేతగా బాధ్యతలు అప్పగిస్తారా? లేక మరేదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్నదానిపై గులాబీ శ్రేణుల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే ఓడిపోతే పోయేదేమీ లేదు.. విశ్రాంతి తీసుకుంటా అని ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఆయన మాటలనే గులాబీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.
ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, విపక్షనేతగా బాధ్యలు తీసుకునేందుకు ఇష్టపడతారా? అసలు ఆయన అసెంబ్లీకి వస్తారా? అనే చర్చా జరుగుతోంది. అధికారంలో ఉన్న రోజుల్లో బీఆర్ఎస్.. విపక్షాలను ఇబ్బంది పెట్టిందనే విమర్శలున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున తమ పార్టీలో చేర్చుకుని, రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చింది. ఒక దశలో రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేసింది.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో నామమాత్రంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మార్చి, ఏప్రిల్ మాసాల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు సవాల్గా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీగా కాంగ్రెస్ దూకుడును ప్రదర్శించే అవకాశం ఉంది. బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ అభ్యర్థులు మనుగడను కాపాడుకోవడం అంత సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.