Michaung Effect: మిగ్ జాం తుపాను సోమవారం సాయంత్రానికి తీవ్రరూపం దాల్చనుంది. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో జనజీవనం స్తంభించింది. సోమవారం తెల్లవారుజాము నుంచి చెన్నైలో కురుస్తోన్న భారీ వర్షానికి నగరంలో ఉన్న 14 రైల్వే సబ్ వే ల్లోకి నీరు చేరింది. దాంతో వాటన్నింటినీ మూసివేశారు.
ప్రస్తుతం వాతావరణశాఖ అంచనలా ప్రకారం.. చెన్నై, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను చెన్నైలో మోహరించారు. తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకున్న 15 మందిని ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. బాసిన్ బ్రిడ్జ్, వ్యాసర్ పాడి మధ్యలో బ్రిడ్జ్ నంబర్ 14ను మూసివేశారు. చెన్నైలో పాఠశాలలతో పాటు కోర్టులకు కూడా సెలవు ప్రకటించారు.
చెన్నై-మైసూర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, కోయంబత్తూర్ కోవై ఎక్స్ ప్రెస్, కోయం బత్తూర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్ ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను సోమవారం రద్దు చేశారు. సబర్బన్ రైళ్లు కూడా రద్దయ్యాయి. ఎంటీసీ సంస్థ 2800 బస్సుల్లో కేవలం 600 బస్సులను మాత్రమే తిప్పుతోంది. వర్షాల కారణంగా సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం వల్లే సర్వీసులను తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
భారీవర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్టులో వర్షపునీరు నిలిచింది. కోయం బత్తూరు- చెన్నై మధ్యలో 2 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. చెన్నై ఎయిర్ పోర్టుకు రావాల్సిన 11 విమానాలను బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి మళ్లించారు.