Speaker Sentiment : రేవంత్రెడ్డి, కేసీఆర్ సహా అందరి గెలుపు ఒక ఎత్తు. ఆయన ఒక్కరి విజయం మరో ఎత్తు. ఎవరాయన? ఎందుకంత స్పెషల్ అంటారా? ఈ స్పెషల్ రిపోర్ట్ చూడండి.
అసెంబ్లీ స్పీకర్గా చేస్తే.. ఎన్నికల్లో ఓటమే. ఇది తెలుగు రాష్ట్రాల్లో నిన్నటివరకు కొనసాగిన ట్రెండ్. ఈసారి ఆ సెంటిమెంటుకు బ్రేకులు పడ్డాయి. ఆ ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డిదే. వరుసగా 8వ సారి విజయం సాధించారాయన. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో తొలి స్పీకర్గా పనిచేసిన చరిత్ర మధుసూదనాచారిది. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన నాయకుడు. అయినా కూడా స్పీకర్గా పనిచేసిన తర్వాతి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. మధుసూదనాచారి భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
చరిత్రలో ఇంకాస్త వెనక్కి వెళ్తే.. దుద్దిళ్ల శ్రీపాదరావు 1989 ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచారు. స్పీకర్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 1994లో ఓటమి పాలయ్యారు.
టీడీపీ నాయకురాలు ప్రతిభా భారతి కూడా ఇంతే. ఏపీలో తొలి మహిళా స్పీకర్గా రికార్డు పుటల్లోకి ఎక్కారు ప్రతిభా భారతి. 1999లో ఎచ్చెర్ల నుంచి గెలిచారామె. స్పీకర్గా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 2004లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా గెలవలేదు. నియోజకవర్గం మారిన ఫలితంలో మాత్రం మార్పు రాలేదు. 2009, 2014లో రాజాంలో ఓడిపోయారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న మాజీ స్పీకర్ సురేష్రెడ్డిదీ ఇదే చరిత్ర. 2004 ఎన్నికల్లో బాల్కొండ నుంచి గెలిచాక, స్పీకర్ అయ్యారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో సురేశ్ రెడ్డి ఓడిపోయారు. బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు.
నాదెండ్ల మనోహర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చిట్టచివరి స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కూడా ఈ ట్రెండ్ను కొనసాగించినవారే. వరుసగా రెండుసార్లు గెలిచి ఊపుమీదున్న ఆయన వైఎస్సార్ హయాంలో డిప్యూటీ స్పీకర్గా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక సభాపతి కుర్చీలో కూర్చున్నారు. 2014,2019 ఎన్నికల్లో నాదెండ్ల చిత్తుగా ఓడిపోయారు. విజయం కోసం ఎదురుచూస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే.. వైఎస్సార్ హయాంలో స్పీకర్గా చేశారు. వైఎస్ మరణానంతరం రోశయ్య తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొత్త రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లినా.. సంపూర్ణంగా తిప్పికొట్టారు జనం.
2014లో కోడెల శివప్రసాద్ రావు సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున గెలిచారు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి స్పీకర్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి నుంచి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓటమి పాలయ్యారు. స్పీకర్ ఓడిపోతారనే సెంటిమెంట్ కొనసాగింది.
ఈ విషయంలో మరొక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయనే సీనియర్ పొలిటీషియన్ యనమల రామకృష్ణుడు. 1995 నుంచి 99 వరకు స్పీకర్గా చేశారు. ఆ తర్వాతి 1999,2004 ఎన్నికల్లో గెలిచారాయన. ఆ తర్వాత వరుస ఓటములు వెక్కిరించాయి. గత చంద్రబాబు మంత్రివర్గంలో ఎమ్మెల్సీ అయ్యి ఆర్థికమంత్రిగా పనిచేశారు. కాబట్టి.. ఈయన్ను కాస్త మినహాయింపుగా చెప్పొచ్చు. మరి, కొన్నేళ్ల ట్రెండ్ను బ్రేక్ చేసిన ఫుల్టైమ్ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి.. యనమల లైన్లోకి వెళ్లారు. అయితే.. వయోభారంతో ఉన్న పోచారం.. ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపలేదు. స్పీకర్ ఓడిపోతారనే ట్రెండ్కు భయపడ్డారనే ప్రచారం కూడా జరిగింది. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ దగ్గర ప్రతిపాదించారు. మీరైతేనే కరెక్ట్ అంటూ పోచారంనే బరిలోకి దించారు కేసీఆర్. తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కొత్త చరిత్ర లిఖించారనే చెప్పాలి.