Michaung in Tirumala: ఏపీపై మిగ్జాం తుపాను విరుచుకుపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం లోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య దివిసీమ వద్ద తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 1977 నవంబర్ 19.. అతి భయంకరమైన తుపాను దివిసీమను తాకడంతో వచ్చిన ఉప్పెన కారణంగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ దివిసీమ వద్ద తుపాను తీరం దాటుతుందని వార్తలు రావడంతో.. ఆనాటి విషాదం మళ్లీ కళ్లముందు కదలాడుతోంది.
తిరుమలలోనూ మిగ్జాంప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో.. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో.. సిబ్బంది వాటిని తొలగించారు. భారీ వర్షాల నేపథ్యంలో స్వర్ణముఖి బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో.. అధికారులు 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరికొన్ని గేట్లను ఎత్తేందుకు ప్రయత్నిస్తుండగా.. అవి మొరాయిస్తున్నాయి.
ఇటు నెల్లూరులోనూ మిగ్జాం బీభత్సం సృష్టిస్తోంది. భారీవర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు కైవల్య నది ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి జనజీవనం అస్తమవ్యస్తమైంది.
తుపాను కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. కుప్పం మీదుగా వెళ్లే చెన్నై, మైసూర్ మార్గంలో 4 ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. డబుల్ డెక్కర్, బృందావన్ ఎక్స్ ప్రెస్, లాల్ బాగ్, శతాబ్ది ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి.
రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు సైతం రద్దయ్యాయి. చెన్నై – శ్రీకాళహస్తి మధ్య ఆర్టీసీ బస్సులను, తిరుపతి – కంచి మధ్య బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.