నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న మిగ్జాం.. కోస్తాంధ్ర తీరంపై విరుచుకు పడుతోంది. విశాఖ, గోదావరి జిల్లాలు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వీస్తోన్న ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. వరదనీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కోస్తాంధ్ర తీరప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
తుపాను కారణంగా బాపట్ల మండలం సూర్యలంక అడవి పల్లెపాలెం తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఉధృతంగా ఎగసిపడుతున్నాయి. గోవర్థనపురం, సీఎల్ఎన్ పల్లి వద్ద పాముల కాలువ, కాడూరు వద్ద సున్నపు కాలువ, పాండూరు వద్ద రాళ్ల వాగు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు కూడా ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి ఎక్కడికక్కడ రాకపోకలు స్తంభించాయి. వరదయ్యపాలెం చెరువుకు గండి పడే ప్రమాదం ఉండటంతో అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
తిరుమలలోనూ మిగ్జాం ప్రభావం కనిపిస్తోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులు తీవ్రమైన చలి, భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు భక్తులను అనుమతించడం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని స్వర్ణముఖి ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం 2004 అడుగుల వద్ద కొనసాగుతోంది. వర్షాల కారణంగా నది ప్రవాహం మరింత పెరగనున్న నేపథ్యంలో.. తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
అటు నెల్లూరులోనూ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 250 మందిని తరలించారు. ఉమ్మడి కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను నేపథ్యంలో అన్ని తీరప్రాంత జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది.
ఒంగోలు 08592-280306
కాకినాడ టౌన్ 0884-2374227
తెనాలి 08644-227600
గూడూరు 08624-250795, 7815909300
నెల్లూరు 0861-2345863
ఏలూరు 08812-232267
బాపట్ల 08643-222178
భీమవరం టౌన్ 08816-230098, 7815909402
గుడివాడ 08674-242454
విజయవాడ 0866-2571244
తుని 0885-4252172
రాజమండ్రి 0883-2420541
సత్యసాయి జిల్లా 08885 292432